ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. భానుడి భగభగలకు జనం విలవిలలాడుతున్నారు. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఎండ తీవ్రత బుధవారం నాటికి మరింత గరిష్టస్థాయికి చేరుకోనుంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA Advisory)ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో ఎండల తీవ్ర అసాధారణంగా పెరుగుతోందని, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పిడుగురాళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు
మంగళవారం నాటి గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రంలోని 28 జిల్లాలకు కాను, 23 జిల్లాల్లోని మొత్తం 233 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. పల్నాడు జిల్లాలలోని పిడుగురాళ్ల(Piduguralla Temperature)లో అత్యధికంగా 45.6 డిగ్రీలు రికార్డు అయ్యింది. నెల్లూరు జిల్లా గూడూరులో 44.9 డిగ్రీలు, కృష్ణా జిల్లా కంకిపాడులో 44.5 డిగ్రీలు మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, మార్కాపురం జిల్లా పెదచర్లోపల్లి వంటి ప్రాంతాల్లో కూడా 44 డిగ్రీల మార్కును ఉష్ణోగ్రతలు దాటేశాయి.
నేడు మరింత తీవ్రంగా భానుడు
మే 20, బుధవారం నాడు ఎండ తీవ్ర మరింత ఎక్కువగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రధానంగా ఉత్తర, మధ్య కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు నమోదు అయ్యే ప్రమాదం ఉంది.
45-47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే జిల్లాలు
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం.
43-45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే జిల్లాలు
నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి
41-43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే జిల్లాలు
అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాలు
వాయువ్య భారతం నుంచి వీస్తున్న వేడి గాలులు కారణంగా ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
348 మండలాల్లో వడగాల్పులు
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నాడు వడగాల్పులు ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండబోతోంది. మొత్తం 71 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మోర 277 మండలాల్లో వడగాల్పులు విస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా 18 మండలాలు, అనకాపల్లిలోని 20 మండలాలు తీవ్ర వడగాల్పుల భారిన పడనున్నాయి.
ప్రస్తుతం వాయవ్య భారతం నుంచి వేడి గాలులు కోస్తాంధ్ర, రాయలసీమ వైపు వీస్తున్నాయి. దీనికి తోడు, కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తా వరకు ఒక ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉంది. ఈ వాతావరణ మార్పుల వల్ల కొన్ని చోట్ల తీవ్రమైన ఎండలు ఉంటుండగా, రాయలసీమలో మాత్రం చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ప్రజలకు హెచ్చరిక (Summer Precautions)
తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. శరీరం డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. మజ్జిగా, కొబ్బరి నీరు, నిమ్మరసం తీసుకోవాలి. వదలుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. బయటకు వెళ్లాల్సి వస్తే తలపాగా, గొడుగు, టోపీని ధరించాలి. వేడి గాలి చెవుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, అనారోగ్య సమస్యలు ఉన్న వారు ఎండలో తిరగడం ప్రాణానికి ముప్పుగా మారవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ వడగాల్పుల తీవ్రత వచ్చే ఆదివారం వరకు కొనసాగే అవకాశం ఉందని అంచనా, కాబట్టి ప్రజలు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడదెబ్బ బారిన పడకుండా ఉండొచ్చు.
