AP Assembly Deputy Speaker Notification: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదలైంది. నేటి సాయంత్రం వరకూ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ నుంచి కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్‌ వేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3.30 గంటలకు కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్‌ వేయనున్నట్లు సమాచారం. డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక సోమవారం జరుగుతుందని స్పీకర్‌ శాసనసభలో ఇదివరకే ప్రకటించారు. బలాబలాల పరిశీలస్తే డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గురువారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు సమర్పించారు. వెంటనే స్పీకర్ తమ్మినేని ఆ రాజీనామాను ఆమోదించారు. ఈ సమావేశాల్లో మరో డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాల కారణంగా కోన రఘుపతిని రాజీనామా చేయాలని సీఎం జగన్ కోరినట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల మంత్రి వర్గ విస్తరణ తర్వాత కొన్ని పదవుల్లో మార్పుచేర్పులుచేయాలనుకున్నారు. ఇటీవలే ఏపీ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్‌గా మల్లాది విష్ణును నియమించారు. చీఫ్ విప్‌గా శ్రీకాంత్  రెడ్డిని తొలగించి ప్రసాదరాజును నియమించారు. 


కోలగట్ల వీరభద్రస్వామికి చాన్సిస్తున్న సీఎం జగన్ 


కోన రఘుపతి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేయగా.. ఈ స్థానాన్ని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. గత కేబినెట్ విస్తరణ సమయంలో  మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావును మంత్రిగా తొలగించారు. కానీ ఆయన సామాజికవర్గానికి చెందిన మరెవరికీ మంత్రి పదవి ఇవ్వలేదు. ఈ కారణంగా డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలనుకున్నారు. మంత్రి పదవి ఆశించిన కోలగట్ల వీరభద్ర స్వామికి ఈ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కోన రఘుపతితో రాజీనామా చేయించినట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి మూడున్నరేళ్ల వరకూ ఉన్నారు. వచ్చే ఏడాదిన్నర వరకూ ఆ పదవిలో కోలగట్ల వీరభద్రస్వామి ఉండే అవకాశం ఉంది. 


రెండు  సార్లు మంత్రి పదవి ఆశించారు, కానీ ! 
కోలగట్ల వీరభద్ర స్వామి సీనియర్ నేత. వైఎస్ఆర్‌సీపీ పార్టీ స్థాపించిన నాటి నుంచి జగన్ తో ఉంటున్న లీడర్. ఆయనకు తొలిమంత్రివర్గంలోనే చోటు దక్కుతుందని అందరూ భావించారు. కానీ వైశ్య సామాజికవర్గం కోటాలో వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఆ పదవి కేటాయించారు. రెండో విడత అయినా దక్కుతుందని భావించినా కొన్ని రాజకీయ కారణాల వల్ల అది వీలు కాలేదు. ఇప్పుడు ఆయనకు కేబినెట్ హోదాతో డిప్యూటీ స్పీకర్ పదవిని అప్పగిస్తున్నారు. కోలగట్ల వీరభద్రస్వామి డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నిక అయితే.. స్పీకర్.. డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ ఉత్తారంధ్ర ప్రాంతానికి చెందిన వారే ఉంటారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్‌గా ఉన్నారు. 


 Also Read: AP Assembly Live Updates 2022: కడప స్టీల్ ప్లాంట్ ఎప్పటికి పూర్తి చేస్తారు: మంత్రికి అచ్చెన్నాయుడు సూటి ప్రశ్న 


Also Read: Chandrababu: టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇస్తా - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు