Andhra Pradesh Cabinet Decisions : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. వాళ్లకు 200 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా ఇచ్చేందుకు అంగీకరించింది. మరమగ్గాలకు 500 యూనిట్ల ఫ్రీ విద్యుత్‌ ఇచ్చేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 


ఇవాళ (17మార్చి 2025) సమావేశమైన మంత్రి వర్గం రాజధాని అమరావతిలో పనులు వివిధ సంస్థలకు కేటాయింపుపై కూడా నిర్ణయం తీసుకుంది. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సూచనలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వీటితోపాటు నంబూరులోని వీవీఐటీయూ ప్రైవేట్‌ వర్సిటీ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యువబుల్‌ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకి కూడా ఓకే చెప్పింది. ఇంకా 15కుపైగా అంశాలపై లోతైన చర్చ నడుస్తోంది. పది పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. 


ఆర్థిక శాఖ
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 205 ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తదుపరి ఖర్చుల కోసం ప్రతిపాదించిన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.


ఉన్నత విద్యా శాఖ:
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్శిటీ (VVITU) ని బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరీ కింద ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్థాపనకు అనుమతి ఇచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టం 2016 షెడ్యూల్‌ను సవరించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. విద్యా ప్రమాణలు మెరుగుకు, ఉన్నత విద్య అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు, ఆర్థిక ప్రగతిని పరిశోధనాత్మక సామర్థ్యాలను పెంచేందుకు ఈ సవరణ దోహదపడుతుంది.


.పాఠశాల విద్యా శాఖ:
ఉపాధ్యాయుల కోసం ఏపీ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025ను ప్రవేశపెట్టడానికి రూపొందించిన ముసాయిదా బిల్లు ప్రతిపాదనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 


పురపాల మరియు పట్టణాభివృది శాఖ:
CRDA ప్రాంతంలోని వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులపై మంత్రుల బృందం చేసిన సిఫార్సులను ఆమోదించింది. అమరావతి భూ కేటాయింపు నియమ, నిబంధనలు 2017 ప్రకారం చర్యలు తీసుకోనున్నారు.  


పురపాల మరియు పట్టణాభివృది శాఖ:
(ఎ) రూ.390.06 కోట్ల విలువైన APTRANSCO 400KV DC లైన్ (18 KM), PGCIL 400KV DC లైన్ల (20 KM) రీరూటింగ్ బ్యాలెన్స్ పనులకు, రూ.1082.44 కోట్ల విలువైన N10 నుంచి N13 - E1 జంక్షన్ వరకు UG కేబుల్స్ ద్వారా 220KV EHV లైన్ల రీరూటింగ్ బ్యాలెన్స్ పనులకు అనుమతులు ఇచ్చింది. ఈ పనుల్లో రూ.390.06 కోట్ల పనులను అంచనా నిర్మాణ వ్యయం కంటే 8.99% అదనపు మొత్తానికి హైదరాబాద్‌కు చెందిన మెస్సర్స్ పివిఆర్ కన్‌స్ట్రక్షన్స్, మెస్సర్స్ కె.రామచంద్రరావు ట్రాన్సుమిషన్ &ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుమతి ఇచ్చారు. బెంగళూరులోని మెస్సర్స్ బిఎస్‌ఆర్‌ఐన్‌ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్‌కురూ.1082.44 కోట్లకు అంచనా వ్యయం కంటే 8.98% ఎక్కువ శాతానికి అప్పగించనున్నారు. 


పురపాల, పట్టణాభివృది శాఖ:
ప్యాకేజీ XXXXII క్రింద రూ.834.46 కోట్లతో చేపట్టనున్న రోడ్లు నిర్మాణం, వరద నీటి కాలువ జాతీయ రహదారి-16 వరకు రోడ్డు విస్తరణకు అనుమతి లభించింది. రూ.307.59 కోట్లతో చేపట్టనున్న రోడ్లు నిర్మాణం, వరద నీటి కాలువ, పాత జాతీయ రహదారి మంగళగిరి వరకు E15 రోడ్డు విస్తరణకు ఆమోదం తెల్పింది.


శాసనసభ, హైకోర్టు, సచివాలయం HOD టవర్ల నిర్మాణ కాంట్రాక్టులకు సంబందించి కరెన్సీ సీలింగ్ నిబంధనను సవరణకు కేబినెట్ ఓకే చెప్పింది. రూ.22,607.11 కోట్ల విలువైన 22 పనులకు L1 బిడ్లు ఆమోదానికిమంత్రి మండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు, ADB, HUDCO, KFW ఇతర ఆర్థిక ప్రాజెక్టులకు సంబంధించిన రూ.15,095.02 కోట్ల విలువైన 37 పనులు చేపట్టేందుకు అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్‌కు అధికారం ఇచ్చారు.


జలవనరుల శాఖ: 
రూ.180.00 లక్షలతో ఎన్టీఆర్ జిల్లా వెలగలేరు వద్ద బుడమేరు డైవర్షన్ రెగ్యులేటర్ మెకానికల్ ఎలక్ట్రికల్ వస్తువుల మరమ్మతులు పునరుద్ధరణ పనులకు ఓకే చెప్పారు. రూ.3797.00 లక్షలతో బుడమేరు డైవర్షన్ ఛానల్ వరద నివారణ రక్షణ గోడల నిర్మాణానికకి ఆమోదించారు.


ఐటి, ఇ & సి:
ఏపీలో స్టార్టప్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ ప్రోత్సహించడానికి ITE&C విభాగానికి అవకాశం కల్పిస్తూ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. 


పరిశ్రమలు వాణిజ్య శాఖ: 
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికుల గృహాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తారు. పవర్‌లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఆమోదించారు. ఈ నిర్ణయం వల్ల 93 వేల మంది చేనేత కార్మిక గృహాలకు, 10,534 పవర్ లూమ్ యూనిట్లకు లబ్ధి జరగనుంది. 


ఇంధన శాఖ 
AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద అనంతపురము, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 4000 MW పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్రాజెక్టులను M/s. AP NGEL హరిత్ అమృత్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్నారు. అన్నమయ్య & వైఎస్ఆర్ జిల్లాల్లో 1800 మెగావాట్ల ఆఫ్-స్ట్రీమ్ క్లోజ్డ్ లూప్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ (OCPSP) ఏర్పాటు కోసం మెస్సర్స్ ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు అటవీ పరిరక్షణార్థం 350 హెక్టార్ల (864.87 ఎకరాలు) భూమిని కేటాయించారు.  


ఇంధన శాఖ 
కొత్త పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, ఇతర పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అమలు కోసం SPV ఏర్పాటు కోసం NHPCతో చేసుకున్న JV ఒప్పందానికి ఓకే చెప్పారు.  


సాధారణ పరిపాలనా శాఖ


ముఖ్యమంత్రి కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు మూడు (03) ఫోటోగ్రాఫర్ పోస్టులు, రెండు (02) వీడియోగ్రాఫర్ పోస్టులు ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. జిల్లా కార్యాలయాలు, కమిషనరేట్ ఆఫ్ I&PR శాఖకు 15 వీడియోగ్రాఫర్ పోస్టుల్లో ఒక (01) ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ పోస్టు, ఒక (01) అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ పోస్టు, రెండు (02) వీడియోగ్రాఫర్ పోస్టులను రద్దు చేశారు. 


వై.ఏ.టి. & సి:
వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం దిగువపట్నం గ్రామంలో ‘ఒబెరోయ్ విలాస్’ రిసార్ట్ అభివృద్ధి కోసం మెస్సర్స్ ముంతాజ్ హోటల్స్ లిమిటెడ్ (ఒబెరోయ్ గ్రూప్) కు కేటాయించిన 50 ఎకరాల భూమిని, దానికి యాక్సెస్ రోడ్డుకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజక్టు ద్వారా దాదాపు 1500 ఉద్యోగాలు రానున్నాయి. విశాఖపట్నంలోని భీమిలి మండలం అన్నవరం గ్రామంలోని మెస్సర్స్ మేఫేర్ హోటల్స్ & రిసార్ట్స్ లిమిటెడ్‌కు సంబంధించి రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు తీసుకున్న నిర్ణయాలను ఆమోదించారు. ఈ సంస్థకు 40.00 ఎకరాల భూమి కేటాయించారు. ఈ ప్రాజెక్టు  ఏర్పాటుకో ప్రస్తుతానికి  200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఏడో సంవత్సరం ప్రాజక్టు పూర్తయ్యే సరికి మరో 750 మంది ఉద్యోగ అవకాశలు కలుగుతాయి. 


జలవనరుల శాఖ
గత ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతల్లో పనులు చేపట్టేందుకు రూ.6373.23 లక్షలు ఖర్చు చేయడానికి ఓకే చెప్పారు.