AP Home Minister Anitha: శ్రీసత్యసాయి జిల్లాలో సంచలనం రేపిన అత్తాకోడళ్లపై అత్యాచార కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో వెలుగు చూస్తున్న అంశాలను చూసి పోలీసులే షాక్ తింటున్నారు. ఈ కేసులో నిందితులను 48 గంటల్లోనే పట్టుకున్నామని హోమంత్రి అనిత ప్రకటించారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారని తెలిపారు. చిక్కిన నిందితుల్లో ఒకరిపైనే ఏకంగా 32 కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసిన ప్రభుత్వం వారికి త్వరగా శిక్షలు పడేలా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతల కాపడటమే ప్రధాన లక్ష్యంగా తాము పని చేస్తున్నామని అని వెల్లడించారు. అందుకే నేరాలు తగ్గించేందుకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. నేరాలు జరిగినా నిందితులను త్వరగా పట్టుకొని శిక్షలు పడేలా చూస్తున్నామని వెల్లడించారు. ముఖ్యమంగా మహిళ భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. మహిళలను హింసించే కేసులో జాప్యం జరగకుండా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 


మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడిన ఘటనలపై చాలా సీరియస్‌గా ఉంటున్నామన్నారు. సత్యాసాయి జిల్లాలో జరిగిన ఘటనపై కూడా నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబే జిల్లా ఎస్పీతో మాట్లాడి కేసులో నిందితుల వివరాలు తెలుసున్నారని వారిని వెంటనే పట్టుకోవాలని ఒత్తిడి తెచ్చారన్నారు. అందుకే సాంకేతికతను ఉపయోగించి నిందితులను 48 గంటల్లో చట్టం ముందు నిలబెట్టామని తెలిపారు. 


రాష్ట్రంలోని ప్రార్థనామందిరాల పరిరక్షణకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు అనిత. అందుకే ప్రతి ప్రార్థనా మందిరం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అదే టైంలో రాష్ట్రంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ముఖ్యంగా విద్యాసంస్థల్లో అలాంటి అనవాలులేకుండా ఉండేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. విద్యాసంస్థలతోపాటు హాస్టల్స్‌ వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.