గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న భూహక్కు-భూరక్ష కార్యక్రమానికి అవసరమైన సర్వేరాళ్లను సిద్దం చేసి అందించే ఆర్డర్ ను రాష్ట్రంలోని గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులకు అప్పగిస్తున్నామని మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలోని వందలాది గ్రానైట్ పరిశ్రమలకు పని లభిస్తుందని, ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది మందికి ఉపాధి మెరుగవుతుందని అన్నారు.  రాష్ట్రంలో వంద సంవత్సరాల తరువాత సమగ్ర భూసర్వే జరుగుతోందని అన్నారు. ఎటువంటి భూవివాదాలు లేకుండా అత్యంత శాస్త్రీయ విధానంలో జరుగుతున్న ఈ సర్వే కోసం దాదాపు 3 కోట్ల సర్వేరాళ్లు అవసరమని అన్నారు. గ్రానైట్ తో తయారు చేసే ఈ రాళ్ల ఆర్డర్ లను రాష్ట్రంలోని గ్రానైట్ ఫ్యాక్టరీలకు ఇవ్వడం ద్వారా వారికి  పనికల్పించడం, ఆర్థికంగా వారిని బలోపేతం చేయడం ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే పలు జిల్లాల్లో ఫ్యాక్టరీ నిర్వాహకులు ముందుకు వచ్చారని, మరిన్ని ఎక్కువ గ్రానైట్ ఫ్యాక్టరీలు ఈ సర్వేరాళ్లను తయారు చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు, వారిని ప్రోత్సాహాన్ని అందించేందుకే ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.


దేశంలోనే టాప్ ఆంధ్రప్రదేశ్


దేశం వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లోనే  అత్యంత వేగంగా సమగ్ర భూసర్వే జరుగుతోందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఇందుకోసం కనీసం రోజుకు లక్ష సర్వే రాళ్లు అవసరమవుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే గ్రానైట్ లీజుదారుల నుంచి ఉచితంగా ముడిరాయిని సర్వేరాళ్ల కోసం అందిస్తున్నామని తెలిపారు. అయితే సర్వేరాళ్లను సిద్ధం చేసి అందించడంలో అనుకున్న లక్ష్యం అనుగుణంగా ఫ్యాక్టరీలు పనిచేయడం లేదని, అందుకు గల కారణాలను, అడ్డంకులను సమీక్షించేందుకు  అందరి అభిప్రాయాలను స్వీకరిస్తున్నామని తెలిపారు. గ్రానైట్ లీజుదారుల నుంచి ఉచితంగా అందిస్తున్న ముడిరాయిలో నాణ్యత లేకపోవడం వల్ల రాళ్ళ తయారీలో వ్యయం పెరుగుతోందని, బయటి నుంచి ముడిరాయిని కొనుగోలు చేసి సర్వే రాళ్ళను అందించేందుకు ఫ్యాక్టరీ నిర్వాహకులు సిద్దంగా ఉన్నామంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇందుకు గానూ ప్రస్తుతం ఇస్తున్న రేటును పెంచేందుకు ప్రభుత్వం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గ్రానైట్ సర్వేరాళ్ళ రవాణాను కూడా తయారీదారులకే అప్పగించాలని కోరారు. గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని, రేటు విషయంలో సహేతుకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అలాగే సర్వేరాళ్ళ తయారీదారులకే రవాణా కాంట్రాక్ట్ ను కూడా ఇస్తామని భరోసా ఇచ్చారు.  ప్రభుత్వం ఈ ఏడాది ఆఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా భూసర్వే పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోందని, అందుకు అవసరమైన సర్వేరాళ్ళను సిద్దం చేసి అందించాలని మంత్రి పిలుపునిచ్చారు.


లక్ష్యాలకు అనుగుణంగా మైనింగ్ రెవెన్యూ


 వైయస్ జగన్   సీఎంగా బాధ్యతలు తీసుకున్న తరువాత గనుల శాఖలో పలు సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు. ఈ మూడేళ్ళలో గనులశాఖ ద్వారా ప్రభుత్వానికి వస్తున్న రెవెన్యూలో పురోగతిని సాధించామని తెలిపారు.  2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 2068 కోట్లు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 2790 కోట్లు మైనింగ్ రెవెన్యూ సాధించామని తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.4500 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే రూ. 3414 కోట్లు ఆర్జించడం జరిగిందని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం లక్ష్యాన్ని అధిగమించి మొత్తం రూ.5010 కోట్ల రూపాయలను సాధిస్తామని, ఈ అంచనాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో మైనింగ్ కార్యక్రమాలను మరింత పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా నాన్ వర్కింగ్ లీజుల్లో మైనింగ్ కార్యక్రమాలు ఊపందుకున్నాయని అన్నారు. రాష్ట్రంలో 5009 క్వారీ లీజులు ఉండగా వాటిల్లో 2285 లీజుల్లో మైనింగ్ జరుగుతోందని తెలిపారు. మిగిలిన వాటిల్లో కూడా మైనింగ్ ప్రారంభించేలా గనులశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


ఈ ఆక్షన్...అమలులోకి


మైనింగ్ రంగంలో ఔత్సాహికులకు అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఈ-ఆక్షన్ విధానాన్ని  ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిందని తెలిపారు. దీనిలో భాగంగా మైనర్ మినరల్స్ కు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 505 ఏరియాలకు ఈ-ఆక్షన్ విధానంను వర్తింప చేశామని, దీనిలో 106 ఏరియాలకు లీజుల ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. మరో 110 ఏరియాలకు లీజు ప్రక్రియ దశలో ఉందని, అలాగే 395 ఏరియాలకు లీజుల జారీ ప్రక్రియ ముగింపు దశలో ఉందని వెల్లడించారు. ఈ-ఆక్షన్ పై మైనింగ్ పై ఆసక్తి ఉన్న వారిలో అవగాహన కల్పించేందుకు ఇతర రాష్ట్రాల్లో కూడా రోడ్ షోలను నిర్వహిస్తున్నామని అన్నారు.