Tdp Protest on Power Charges : రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు బాదుడే బాదుడు అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. జగనూ! నీకో దండం అని ప్రజలు అంటున్నారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో బాదుడే బాదుడు అని చెప్పి ఇప్పుడు సీఎం జగన్ బాదుతున్నారని ఆరోపించారు. పింఛన్ డబ్బులు తీసుకొని ప్రేయసితో జంప్ అయిపోయినందుకు వాలంటీర్లకు వందనం కార్యక్రమం పెట్టడం భేష్ అని ఎద్దేవా చేశారు. ఫ్యానుకు ఓటేసిన పాపానికి ఫ్యాన్ తిరగకుండా చేస్తున్నారని విమర్శిచారు. రావాలి జగన్, కావాలి జగన్ అని పాట పాడినవారు, జై జగన్ అని నినాదాలిచ్చినవారి ఇండ్లల్లో వారిని ఆడవాళ్లు తంతున్నారన్నారు. ప్రజల కష్టాలు తనవి కావు అన్నట్లుగా వ్యవహరించడం జగన్ కే సాధ్యమని వంగలపూడి అనిత విమర్శించారు. సంక్షేమ కార్యక్రమాలకు ఓ పత్రికలో యాడ్ కు రూ.20 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు. జగన్ పాదయాత్ర సమయంలో సేవ చేసినవారికి సలహాదారు పోస్టులివ్వడం దారుణమన్నారు. దిల్లీ వెళ్లి రాష్ట్ర పరిస్థితుల గురించి చెప్పకుండా బేల కబుర్లు ఎందుకని విమర్శించారు. డ్వాక్రా మహిళల రూ.2 వేల కోట్లు ఎవరి అకౌంట్లలోకి వెళ్లాయని ప్రశ్నించారు. 






కడపలో టీడీపీ ధర్నా 


పన్నుల పేరుతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలను పట్టిపీడిస్తుందని అని టీడీపీ నేతలు ఆరోపించారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ కడప నగరంలో వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ కడప నియోజకవర్గ ఇన్చార్జ్ అమీర్ బాబు, సీనియర్ నాయకులు లక్ష్మీ రెడ్డి, నగర అధ్యక్షుడు కొండా రెడ్డిలతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలను పెంచుతుందని బాదుడే బాదుడు అంటూ ఆనాడు ఆరోపణలు చేసిన జగన్ మోహన్ రెడ్డి నేడు ఏ విధంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు. అసలే కరోనా కారణంగా జనజీవనం అస్తవ్యస్తమై ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు అల్లాడుతుంటే వారి పట్ల కనికరం లేకుండా వైసీపీ ప్రభుత్వం నిర్ధాక్షణ్యంగా వ్యవహరిస్తున్నాదని ఆరోపించారు. ఓటేసిన ఫ్యాన్ కు ఇంట్లో స్విచ్ వేయాలంటే ప్రజలు భయపడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని లేకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.