Nadendla Manohar :చిత్తూరు జిల్లా పుంగనూరులో పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ ఇంటిపై దాడిని జనసేన ఖండించింది. వైసీపీ ప్రభుత్వ ఆలోచనా విధానానికి ఈ దాడి నిదర్శనం అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో రైతు సభ నిర్వహించాలనుకుంటే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. రైతు సభ నిర్వహించడం ఏమైనా నేరమా? అని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై ప్రశ్నిస్తే దాడులతో బెదిరింపులకు పాల్పడడం, ఆస్తులు ధ్వంసం చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమా? అని మండిపడ్డారు. రామచంద్ర యాదవ్ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తుంటే పోలీసులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. ఈ దాడి ముమ్మాటికీ వైసీపీ వికృత రాజకీయంలో భాగమే అన్నారు. ప్రశ్నించేవారు లేకుండా చేసుకునే కుట్రలో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించే విధంగా జరిగిన దాడిగానే దీనిని భావిస్తున్నామన్నారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా అందరూ దాడిని ఖండించాలని నాదెండ్ల మనోహర్‌ కోరారు.


అసలేం జరిగింది? 


చిత్తూరు జిల్లా పుంగనూరులో పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ ఇంటిపై దాడి జరిగింది. గత ఎన్నికల్లో ఆయన జనసేన తరఫున పోటీ చేశారు. నియోజకవర్గంలో రైతు సమస్యలపై రైతు భేరీ కార్యక్రమాన్ని తలపెట్టారు. దీనికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. సభకు వెళ్లకుండా రాచంద్రయాదవ్‌ను అడ్డుకున్న పోలీసులు సాయంత్రం ఐదున్నర గంటలకు వదిలేశారు. తర్వాత తన అనుచరరులతో కలిసి స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్దకు వెళ్లి క్షీరాభిషేకం చేశారు. తర్వాత అనుచరులంతా ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. అనంతరం రామచంద్ర యాదవ్‌ ఇంటిపై దాడి జరిగింది. ఇది చేసింది వైసీపీ కార్యకర్తలేనంటూ ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. రైతుల సమస్యలపై సభ తలపెట్టామని.. దీన్ని జీర్ణించుకోలేకే తమ ఇంటిపై దాడి చేశారని ఆయన అనుచరులు విమర్శిస్తున్నారు.  


మద్యం మత్తులో దాడి అంటున్న పోలీసులు 


ఆదివారం రాత్రి పుంగనూరు పట్టణం కొత్తిండ్లు ఎల్‌ఐసీ కాలనీలో ఉన్న ఇంటికి వెళ్లి కొందరు యువకులు వీరంగం సృష్టించారు. కర్రలు, రాళ్లతో తలుపులు, అద్దాలు పగలకొట్టి లోపలకు వెళ్లి, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. పార్క్ చేసి ఉన్న కార్లు, బైక్‌లపై విరుచుకపడ్డారు. ఈ దుర్ఘటనలో ఆరు కార్లు, మరిన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయి. అదే ఇంట్లో ఉన్న తను తన ఫ్యామిలీ ఓ గదిలో దాక్కొని ప్రాణాలతో బయట పడ్డామంటున్నారు రామచంద్రయాదవ్. తమ నాయకుడు సదుం వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు ఇంత దాడి జరిగినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు ఆయన సన్నిహితులు. సుమారు 200 మంది వచ్చి దాడి చేశారని చెబుతున్నారు. రామచంద్రయాదవ్ అనుచరుల ఆరోపణలను పోలీసులు ఖండిస్తున్నారు. కొందరు వ్యక్తులు మద్యం మత్తులో రామచంద్ర యాదవ్‌ ఇంటిపై దాడి చేశారని చెప్పారు. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్నామన్నారు. ఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్టు వివరించారు. దీనిపై ఇంత వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అందుకే కేసు రిజిస్టర్ చేయలేదని వివరిస్తున్నారు.