AP Power Tariff : ఏపీలో విద్యుత్ వినియోగదారులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2023-24 సంవత్సరానికి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ప్రకటించింది. దీంతో విద్యుత్ వినియోగదారులపై భారం ఉండదని తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరం విద్యుత్ టారిఫ్ వివరాలను ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి శనివారం ప్రకటించారు. ఈ ఏడాది విద్యుత్ టారిఫ్ పెంచడంలేదని స్పష్టం చేశారు. అయితే రైతులకు అందించే ఉచిత విద్యుత్తు, ఎస్సీ, ఎస్టీలకు  200 యూనిట్ల వరకు సబ్సిడీ, ఆక్వా రంగం, నాయీ బ్రాహ్మణలకు ఇస్తున్న విద్యుత్ రాయితీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ సబ్సిడీలకు ఖర్చు అయ్యే రూ.10135 కోట్లు ప్రభుత్వమే భరించడానికి ముందుకు వచ్చిందన్నారు.  


పెంపు ప్రతిపాదనలు తిరస్కరణ 


2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి ఛార్జీల పెంపు లేదని ఏపీఈఆర్సీ ఛైర్మన్‌  జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. ఆర్థిక అవసరాలపై డిస్కమ్ లు ప్రతిపాదించిన  టారిఫ్‌ లపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టామన్నారు. అనంతరం టారిఫ్‌పై నిర్ణయం తీసుకున్నట్లు జస్టిస్ నాగార్జున రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లు వరకు సబ్సిడీ, ఆక్వా రంగం, నాయీ బ్రాహ్మణలకు ఇస్తున్న విద్యుత్ రాయితీల వల్ల వచ్చిన రూ.10,135 కోట్ల ఆదాయ లోటు రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్ లకు చెల్లించనుందన్నారు.  సాధారణ, పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల కేటగిరిలో కూడా ఎవరిపై ఛార్జీల భారం మోపడంలేదని జస్టిస్‌ నాగార్జునరెడ్డి తెలిపారు. ఎనర్జీ ఇంటెన్సివ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలకు, హెచ్‌టీ వినియోగదారులకు మాత్రం కిలోవాట్‌కు రూ.475 అదనపు డిమాండ్‌ ఛార్జ్‌ల ప్రతిపాదనను అంగీకరించామని వెల్లడించారు. ఇతర పెంపు ప్రతిపాదనలు తిరస్కరించామన్నారు. 


వేసవిలో విద్యుత్ కొరత ఉండకూడదు -సీఎం జగన్ 


వేసవిలో ఏపీ ప్రజలకు విద్యుత్ కొరత ఉండకూడదని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఇటీవల జరిగిన సమీక్షలో  సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.  వేసవిలో విద్యుత్‌ డిమాండ్, రైతుల మోటార్లకు మీటర్లు , నాణ్యమైన విద్యుత్‌ సరఫరా తదితర అంశాలపై ఫిబ్రవరి నెలలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 2వ వారం నుంచి వాతావరణం మారిపోవడంతో  విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మార్చి, ఏప్రిల్‌ నెలలో సగటున రోజుకు 240 మిలియన్‌ యూనిట్లు, ఏప్రిల్‌లో  250 మిలియన్‌ యూనిట్లు ఉంటుందని అంచనా వేశామని.. కోతలు లేకుండా చూడటానికి ఇప్పటికే పవర్‌ ఎక్స్‌ఛేంజ్‌లో ముందస్తుగా విద్యుత్‌ను బుక్‌ చేసుకున్నామని సీఎంకు తెలిపారు. విద్యుత్‌ కొరత కారణంగా కరెంటు కోతలనే సమస్య ఉత్పన్నం కాకూడదని ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అధికారులు అన్నిరకాలుగా సిద్ధం కావాలన్నారు.  థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు కొరతరాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా రైతులు పెట్టుకునే వ్యవసాయ కనెక్షన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో మంజూరుచేయాలన్న సీఎం ఆదేశాలను అమలు చేస్తామని అధికారులు ప్రకటించారు. రైతులకు కనెన్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదన్నారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి 1.06లక్షల కనెక్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరు చేశామని సీఎంకు అధికారులు వివరించారు.