Vasireddy Padma : అనుమానం పేరిట కత్తులు దూస్తూ మహిళల ప్రాణాల్ని తీసే సైకో భర్తల్ని సంఘ బహిష్కరణ చేయాలని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. చట్టబద్ధంగా తేల్చుకోవాల్సిన భార్యాభర్త వివాదాలను ప్రాణాలు తీసేదాకా తీసుకెళ్లే పురుషాహంకార ధోరణి సమాజంలో మారాలన్నారు.  గుంటూరు జిల్లా తెనాలి, అనంతపురం జిల్లాలో అనుమానంతో మహిళల ప్రాణాల్ని పొట్టనబెట్టుకున్న ఉన్మాదుల చర్యలపై శుక్రవారం ఆమె తీవ్రంగా స్పందించారు. ఇలాంటి దుర్మార్గుల ఆగడాలను సభ్య సమాజం ఖండించాలన్నారు. అనంతపురం ఘటనకు సంబంధించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మహిళా కమిషన్ సభ్యులు షేక్ రుకియాబేగం పరామర్శించగా.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వాసిరెడ్డి పద్మ ఆరాతీశారు. ఆమె త్వరగా కోలుకునేందుకు మెరుగైన చికిత్స అందించాలని వాసిరెడ్డి పద్మ ప్రభుత్వ ఆస్పత్రి అధికారులను సూచించారు. తెనాలి ఘటనపై గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పతో మాట్లాడిన వాసిరెడ్డి పద్మ నేరస్తులపై కఠినచర్యలు చేపట్టాలని ఆదేశించారు.


తెనాలిలో భార్యపై కత్తితో దాడి 


గుంటూరు జిల్లా తెనాలిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తెనాలి గాంధీ నగర్ గంటా వారి వీధిలో భార్యను కిరాతకంగా హత్య చేశాడు భర్త.   కాకర్ల స్వాతి, కోటేశ్వరరావులకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. భార్య పేరు మీద ఉన్న స్థలాన్ని అమ్మి తన అప్పులు తీర్చాలని కొద్దీ రోజులుగా ఆమెను వేధిస్తున్నాడు భర్త కోటేశ్వరరావు. ఈ విషయంపై తరచూ గొడవపడేవాడు. స్వాతి స్థానికంగా బ్యూటీ పార్లర్ నడుపుతోంది. గురువారం బ్యూటీ పార్లర్ షాప్ లో స్వాతి ఉండగా కోటేశ్వరరావు కత్తితో దాడి చేశాడు. మెడపై బలంగా నరకడంతో స్వాతి అక్కడికక్కడే కుప్పకూలింది.  అనంతరం ఆమె మృతదేహానికి రెండు దండలు వేసి నివాళి అర్పించాడు. తర్వాత తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు కోటేశ్వరరావు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే హత్యకు ఫ్లాన్ చేసిన కోటేశ్వరరావు వస్తూ రెండు పూల దండలు తీసుకువచ్చి చంపిన తరువాత స్వాతి మృతదేహంపై వేశాడు.  


 అనంతపురంలో మరో ఘటన 


అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో దారుణం జరిగింది. కామర్స్ లెక్చరర్ సుమంగళిపై భర్త కత్తితో దాడి చేశాడు. ప్రిన్సిపల్ రూమ్‌లో తంబ్ వేసి వస్తుండగా కత్తితో గొంతు కోశాడు భర్త పరేష్. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులు చూస్తుండగానే లెక్చరర్‌పై ఆమె భర్త దాడి చేశాడు. చంపేందుకు యత్నించి విఫలమయ్యారు. ఉదయాన్నే కాలేజీ వచ్చిన సుమంగళి... ప్రిన్సిపల్ రూమ్‌కి వెళ్లి హాజరు వేసుకొని వచ్చారు. అప్పటికే అక్కడ రెడీగా ఉన్న ఆమె భర్త పరేష్‌.. ఒక్కసారిగా దాడి చేశాడు. దాడి విషయం తెలుసుకొని తేరుకునే లోపు పరేష్‌... ఆమె మెడపై వేటు వేశాడు. తీవ్ర రక్తస్రవంతో అక్కడే పడిపోయారమే. దీన్ని చూసిన విద్యార్థులు.. పరేష్‌ను అడ్డుకోవడానికి యత్నించారు. వాళ్లంతా వస్తున్న సంగతి తెలుసుకొని అతను అక్కడి నుంచి పరారయ్యాడు. గాయంతో రక్తపు మడుగులో పడి ఉన్న సుమంగళిని విద్యార్థులు, కాలేజీ స్టాఫ్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రాణభయం లేదని వైద్యులు చెప్పారు. సుమంగళి, పరేష్ మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఏడాది క్రితం బదిలీపై సుమంగళి ఈ ఆర్ట్స్ కాలేజీకి వచ్చారు. అంతకు ముందు ఇరవై ఏళ్లపాటు గుంటూరులో ఆమె పని చేశారు. అనంతపురం వచ్చిన తర్వాత శ్రీనివాస్‌ నగర్‌లో నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా పరేష్‌తో విడిగా ఉంటున్నారు. అనుమానం కారణంగానే సుమంగళిపై పరేష్‌ దాడి చేసి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థులు, స్థానికుల నుంచి సమాచారం తీసుకుంటున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న పరేష్‌ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు