నేడు అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇవాళ ఏపీ ప్రభుత్వం నగదు చెల్లించనుంది. రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసిన బాధితులకు రూ.207.61 కోట్లు, రూ.10 వేల నుంచి రూ. 20 వేల లోపు డిపాజిట్‌ చేసిన వారికి రూ. 459.23 కోట్లు చెల్లించనున్నారు. మొత్తం 7 లక్షలకు పైగా అగ్రిగోల్డ్‌ బాధితులకు నగదు జమచేయనున్నారు. అందుకుగాను మొత్తంగా రూ.666.84 కోట్లు చెల్లించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.



అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం మీట నొక్కి నిధులు విడుదల చేయనున్నారు.  రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపు డిపాజిట్‌దారుల ఖాతాల్లో ఆ మొత్తాలను జమ చేయనున్నారు. రెండు రోజుల కిందటి వరకూ అర్హులైన అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు.. డిపాజిట్లకు సంబంధించిన ఒరిజినల్‌ పత్రాలు, చెక్కు, పే ఆర్డర్‌, రశీదులు, బ్యాంకు పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డులను వాలంటీర్లు సేకరించారు. గతంలో రూ.10వేల లోపు డిపాజిట్‌ దారులకు చెల్లించారు. ఇప్పుడు రూ. పది వేల నుంచి రూ. 20వేల వరకూ డిపాజిట్ దారులకు చెల్లిస్తున్నారు. అయితే ఇప్పటికీ లక్షల మంది అగ్రిగోల్డ్ డిపాజిట్లు అసంతృప్తితో ఉన్నారు. తాము రెక్కలు, ముక్కలు చేసుకుని సంపాదించిన సొమ్ము వెనక్కి రావడం లేదన్న అసహనంతో ఉన్నారు. హమీలు ఇచ్చిన రాజకీయ పార్టీలు మోసం చేశాయన్న  భావనలో ఉన్నారు.  
 
అసలు అగ్రిగోల్డ్ స్కాం ఏంటి..?


1995లో అవ్వా వెంకట రామారావు ఛైర్మన్‌గా అగ్రిగోల్డ్ సంస్థ ఏర్పాటైంది. కలెక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీం పేరుతో విజయవాడ కేంద్రంగా డిపాజిట్లు సేకరించింది.  క్రమంగా ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించి ప్రజల నుంచి పెట్టుబడులు సమీకరించింది. భారీగా ఏజెంట్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది. వారికి ఆకర్షణీయమైన కమిషన్లను ఇచ్చింది. ముఖ్యంగా దిగువ మధ్య తరగతి కుటుంబీకులను ఆకర్షించింది.  వేల కోట్ల డిపాజిట్లను సేకరించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనూ ప్రజల నుంచి ఇష్టం వచ్చినట్లు డిపాజిట్లు కట్టించుకున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే వీరి వసూళ్లు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 32 లక్షల మంది నుంచి డిపాజిట్లు స్వీకరించింది. సేకరించిన డబ్బుతో  ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికే వెచ్చించారు. అగ్రిగోల్డ్ ఏడు రాష్ట్రాల్లో 16 వేల ఎకరాలను కొనుగోలు చేసింది. వివిధ బ్యాంకుల్లోని ఆ సంస్థ ఖాతాల్లో రూ.500 కోట్ల డిపాజిట్లు చేసింది.


2015లో చెల్లింపులు చేయలేక చేతులెత్తేసిన యాజమాన్యం..! 


గడువు పూర్తయినా డిపాజిట్లు తిరిగి ఇవ్వకపోవడం, వడ్డీలు చెల్లించకపోవడం, ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడం వంటివి బయటపడడంతో 2014 నుంచి పరిస్థితి మారిపోయింది.   2015 జనవరిలో లక్షలాది మంది బాధితులు బయటకొచ్చి ఆందోళనలు చేశారు. అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావుపై తొలిసారి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సెబీ, రిజర్వ్ బ్యాంకుల అనుమతి లేకుండానే డిపాదిట్లు సేకరించినట్లుగా గుర్తించారు. కేసును  సీఐడీకి బదలాయించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అటాచ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. హైకోర్టు ఆదేశించడంతో.. అటాచ్ చేసిన ఆస్తులను 2016 డిసెంబరు 27న సీఐడీ అధికారులు వేలం వేశారు. కానీ, పెద్ద నోట్ల రద్దు ఇతర కారణాల వల్ల అనేక ఆస్తులను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.  దీంతో డిపాజిటర్లు తీవ్రంగా ఇబ్బందుల్లో పడ్డారు.  అగ్రిగోల్డ్ లో మదుపు చేసిన వారంతా.. దిగువ మధ్యతరగతి కుటుంబాల వాళ్లే. వారికి ఇతర పొదుపు పథకాలపై అవగాహన లేకపోవడం... అగ్రిగోల్డ్ ఏజెంట్లుగా పరిచయస్తులే ఉండటం లాంటి కారణాలతో..  దాదాపు ప్రతి దిగువ మధ్యతరగతి ఇంటిలోకి అగ్రిగోల్డ్ చేరింది. రెక్కలు ముక్కలు చేసుకున్న కష్టం... ఇరుక్కుపోవడంతో వారంతా విలవిల్లాడిపోతున్నారు.


కోర్టు పర్యవేక్షణలో అగ్రిగోల్డ్ వ్యవహారం..! 
  
అగ్రిగోల్డ్ వ్యవహారం మొత్తాన్ని తెలంగాణ హైకోర్టు స్వయంగా పర్యవేక్షిస్తోంది. డిపాజిటర్లకు వారి సొమ్ము వారికి ఇప్పించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అగ్రిగోల్డ్‌ డిపాజిట్ల కన్నా ఆస్తులు ఎక్కువ అన్న ప్రచారం ఉంది. దీంతో ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు చెల్లించాలని ప్రభుత్వాలు నిర్ణయించారు. అయితే అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంకు ఎన్ని సార్లు ప్రయత్నించినా.. అంతంత మాత్రం స్పందనే ఉంటోంది. ఓ సారి అగ్రిగోల్డ్ ఆస్తులను టేకోవర్ చేయడానికి  జీఎస్సెల్ గ్రూప్‌తో ముందుకు వచ్చింది. కోర్టులో రూ. 10 కోట్లు సంస్థ తరపున డిపాజిట్ కూడా చేశారు. కానీ ఏం జరిగిందో కానీ.. తర్వాత తాము వెనక్కి తగ్గుతామని జీఎస్సెల్ గ్రూపు కోర్టుకు తెలిపింది. అప్పట్లో ఈ అంశంపైనా రాజకీయ దుమారం రేగింది.


2019 ఎన్నికల్లో రాజకీయ అంశమైన అగ్రిగోల్డ్..! 


అగ్రిగోల్డ్ బోర్డు తిప్పేయడంతో విపక్ష పార్టీలు అప్పటి పాలక పార్టీ అయిన టీడీపీపై విరుచుకుపడ్డాయి.  వైసీపీ, బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. అగ్రిగోల్డ్ ఆస్తులన్నింటినీ టీడీపీ నేతలు దోచేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఆ సంస్థకు అనేక రాష్ట్రాల్లో ఆస్తులున్నాయి. విజయవాడ - గుంటూరు మధ్య ఉన్న హాయ్ ల్యాండ్ అగ్రిగోల్డ్ దే. హాయ్ ల్యాండ్ ను టీడీపీ నేత లోకేష్ చేజిక్కించుకున్నారని ఆరోపణలు చేశారు. హైకోర్టు పర్యవేక్షణలో అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం జరుగుతుండగా  ఆరోపణలు చేయడంపై అప్పటి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఆ వివాదం అలా కొనసాగింది. లక్షల మంది బాధితులు ఉండటంతో ప్రభుత్వం కూడా ఏదో ఒకటి చేయాలని అనుకుంది. కానీ ఆస్తుల అమ్మకానికి పెద్దగా స్పందన లేకపోవడం తో అప్పటి ప్రభుత్వం ఏమీ చేయలేకపోయారు. ఈ పరిస్థితిని అప్పటి విపక్షాలు బాగా ఉపయోగించుకున్నాయి. అగ్రిగోల్డ్ బాధితులంతా ఓటర్లే కావడం .. వారంతా లక్షల్లో ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు వారికి న్యాయం చేస్తామనే ప్రకటించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే వెంటనే మొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చి ఓటర్లను హామీ ఇచ్చింది.


తొలి బడ్జెట్‌లోనే రూ. 1150కోట్లిస్తామని వైఎస్ జగన్ ఎన్నికల హామీ..!
 
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదటి బడ్జెట్‌లోనే అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 1150 కోట్లు కేటాయిస్తానని డిపాజిటర్లందరికీ న్యాయం చేస్తానని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలోనూ పెట్టారు. హామీ ఇచ్చినట్లుగానే బడ్జెట్‌లో రూ. 1150 కోట్లు పెట్టారు. కానీ ఆ ఏడాది బడ్జెట్‌లో ఆ సొమ్ము విడుదల చేయలేదు. అగ్రిగోల్డ్ బాధితులు.. తమ డబ్బులు వస్తాయేమోనని ఆశగా ఎదురు చూడటం.. నిరాశతో వెనుదిరగడం... కామన్ అయిపోయింది.  అప్పటి చంద్రబాబు ప్రభుతవం  రూ. 10వేల లోపు డిపాజిటర్లకు రూ.200 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. కానీ ఎన్నికలు రావడంతో ఆ జీవో అమలు కాలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ రూ. 265 కోట్లను   రూ.10 వేలలోపు డిపాజిట్‌ చేసిన వారికి పంపిణీ చేశారు. తొలివిడతలో మొత్తం 3,69,655 మందికి సంబంధించిన డిపాజిట్లు తిరిగి చెల్లించారు.  ఇప్పుడు రూ.20 వేలలోపు వున్న మరో 4 లక్షల మంది డిపాజిటర్లకు కూడా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిధులు మంగళవారం విడుదల చేయనున్నారు.


లబ్దిదారుల ఎంపికపైనా అనుమానాలు.. విమర్శలు.. !
    
సీఐడీ ఇచ్చిన నివేదిక మేరకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర పరిధిలో 32 లక్షల మంది ఖాతాదారులకు రూ.6,350 కోట్లు అగ్రిగోల్డ్‌ చెల్లించాల్సి ఉంది. వీటికి సంబంధించిన ఖాతాదారుల వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో పెట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.  సదరు వివరాలతో అగ్రిగోల్డ్‌ బాధితులు చూపిస్తున్న చెక్కులు, పరివార్‌ బాండ్ల వివరాలను సరి చూసుకుంటే సరిపోతుందని ఖాతాదారులు పేర్కొంటున్నారు. కానీ అప్పటి ప్రభుత్వ కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ అలాంటి ఆలోచన చేయలేదు. తెలంగాణ హైకోర్టులో  ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది. ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలన్న విజ్ఞప్తులు కూడా ప్రభుత్వం చేస్తోంది. హైకోర్టు అనుమతితోనే ప్రభుత్వం బాధితులకు నగదు పంపిణీ చేస్తోంది. 


చనిపోతున్న "అగ్రిగోల్డ్" నిందితులు..! కేసు ఎప్పటికి తేలుతుంది..?


అగ్రిగోల్డ్‌పై ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కూడా కేసులు నమోదు చేసింది. చైర్మన్ అవ్వా వెంకటరామారావును కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే కేసు విచారణ ప్రారంభమైనప్పటి నుంచి పలువురు కీలక నిందితులు, అగ్రిగోల్డ్ డైరక్టర్లు చనిపోయారు. మార్చిలో ఈ స్కాం మొత్తం అవగాహన ఉన్న వ్యక్తిగా భావిస్తున్న అగ్రిగోల్డ్ డైరెక్టర్ అవ్వా ఉదయభాస్కరరావు గుండెపోటుతో మృతి చెందారు. 2019లో అగ్రిగోల్డ్‌ వైఎస్‌ చైర్మన్ సదాశివ వరప్రసాద్‌ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ పార్కింగ్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. డిపాజిటర్లకు చెల్లించాల్సిన వాటి కన్నా ఆస్తులు ఎక్కువేనని అందరూ చెబుతూంటారు. కానీ డిపాజిటర్లకు మాత్రం ఎదురు చూపులు తప్పడం లేదు. ప్రభుత్వమే ఇళ్ల స్థలాల కోసం అగ్రిగోల్డ్ స్థలాలు కొనుగోలు చేసినట్లయియితే అందరికీ ఎవరి డబ్బులు వారికి వచ్చి ఉండేవన్న అభిప్రాయం ఉంది.కానీ ప్రభుత్వం అప్పట్లో పట్టించుకోలేదు. ఇటీవల టిడ్కోతో అగ్రిగోల్డ్ స్థలాలను కొనిపిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. అయితే అప్పటి ప్రభుత్వమైనా ఇప్పటి ప్రభుత్వమైనా ఇలాంటి ప్రకటనలు చాలా చేస్తున్నాయి. కానీ ఆచరణ వరకూ రావడం లేదు. అదే అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన !