రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు చంద్రబాబు తరఫు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వ వైద్యుల సూచనలను జైలు అధికారులు పాటించేలా చూడాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయవాదుల పిటిషన్‌పై వాదనలు విన్న ఏసీబీ కోర్టు,  ఏసీ సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. చంద్రబాబును చల్లని వాతావరణంలో ఉంచాలని ఇప్పటికే ప్రభుత్వ వైద్యులు జైలు అధికారులకు నివేదించారు. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 36 రోజులుగా చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి జైలులో ఉన్నారు. సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిిటిషన్ పై మంగళవారం విచారణ జరగనుంది.


మందులు ఎంత వరకు పని చేస్తాయో ?-వైద్యులు
అంతకుముందు చంద్రబాబు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఆయనకు చల్లటి వాతావరణం అవసరమేనని ప్రభుత్వ వైద్యులు స్పష్టం చేశారు. జైలు ఆవరణలో చంద్రబాబుకు చికిత్స అందిస్తున్న వైద్యులతో కలిసి జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్‌ మాట్లాడారు. చంద్రబాబు వేసుకునే మందులు తమకు చూపించారని, అవి చూసిన తర్వాతే మిగతా మందులు సూచించామన్నారు. చంద్రబాబును చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచాలని జైలు అధికారులకు ఇప్పటికే సూచించామని వైద్యులు తెలిపారు. చల్లని వాతావరణం లేకపోతే తాము ఇచ్చిన మందులు ఎంత వరకు పని చేస్తాయో తెలియదని, ఆయనకు ఎలాంటి స్టెరాయిడ్స్‌ ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. 


అప్రమత్తంగానే ఉన్నాం-డీఐజీ
చంద్రబాబు ఆరోగ్యం, భద్రత విషయంలో అప్రమత్తంగానే ఉన్నామన్నారు జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్‌. ఆయన ఆహార అలవాట్లు ఏమిటో వైద్యులు తెలుసుకున్నామని, అందుకు అనుగుణంగా ఐదుగురు వైద్యులు ఆయనకు చికిత్స అందించినట్టు వెల్లడించారు. అన్ని విషయాలు కోర్టు దృష్టికి తీసుకెళ్తామని, వైద్యుల నివేదికను కూడా వెంటనే కోర్టుకు పంపిస్తామన్నారు. జైలులో ఏసీ పెట్టేందుకు ప్రిజన్‌ రూల్స్‌ ఒప్పుకోవని, ప్రత్యేక కేసుగా పరిగణించి కోర్టు ఆదేశిస్తే అప్పుడు పరిశీలిస్తామన్నారు. 


స్కిల్ డెవలప్ మెంట్ కేసు ఏంటి ?
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నెలరోజులకు పైగా చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నాయి. ఆయన న్యాయవాదులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరగనుంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ ఇస్తామంటూ రూ.3300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్‌టెక్ సంస్థ‌లు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ప్రభుత్వం 10శాతం నిధులు, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం తరపున 10శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.370 కోట్లను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించింది. ప్ర‌భుత్వం చెల్లించిన రూ.370 కోట్లలో రూ.240 కోట్ల రూపాయ‌ల‌ను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థ‌కు బ‌ద‌లాయించారంటూ ఏపీ సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కేబినెట్‌ను తప్పుదారిపట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి డబ్బులు కాజేశారని అభియోగాలు ఉన్నాయి. దీనిపై గత కొంత కాలంగా లోతుగా విచారిస్తున్న సీఐడీ పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది.