18 Non Hindu employees were transferred in Tirumala : అన్యమత ఉద్యోగులపై టీటీడీ చర్యలు ప్రారంభించింది.  పద్దెనిమిది మందిని బదిలీ చేస్తూ నిర్ణయంతీసుకున్నారు. టీటీడీ మహిళ‌ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ అయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్, టీటీడీ అనుబంధ విద్యాసంస్థల్లోని లెక్చరర్లు, వసతి గృహ వార్డెన్లు, తదితరులు మొత్తం 18 మందిని బదిలీ చేశారు.టీటీడీలో ఉన్నత స్థాయిలో అన్యమతాలకు చెందిన వారు ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కొండపై మాంసాహారం, గంజాయి, మద్యం దొరుకుతున్నాయని, దీనివల్ల తిరుమల క్షేత్రం పవిత్రత దెబ్బతింటోందని, అన్యమత ప్రచారం చాపకింద నీరులా విస్తరిస్తోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

టీటీడీ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్య మత ఉద్యోగుల్ని బదిలీ చేస్తామని ప్రకటించారు. వెంటనే ఇతర మతాలకు చెందిన వారి వివరాల్ని సేకరించారు.ఇప్పుడు  టీటీడీలో పని చేస్తూ అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్న వారిని గుర్తించి 69 మందితో కూడిన ఓ జాబితాను టీటీడీ రూపొందించింది. వీరిలో టీటీడీ ఉద్యోగులతో పాటు రిటైర్ అయిన ఉద్యోగులు కూడా వున్నట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గుర్తించారు. దీంతో ఉద్యోగులను బదిలీ చేయాలని నిర్ణయించారు. టీటీడీలో ప్రస్తుతం మరో 300 మంది అన్యమతస్తులు వివిధ విభాగాల్లో పని చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. 

నేరుగా క్రైస్తవులు గా ఉన్న వారిని గుర్తించడం సులువే కానీ మతం మారిన వారిని గుర్తించడం టీటీడీ వర్గాలకు సవాల్ గా మారింది. మతం మారిన వారు గుట్టుగా అన్యమత ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీవారి ఆదాయాన్ని జీతంగా తీసుకుంటూ శ్రీవారిపై నమ్మకం లేకుండా వ్యవహరించే వారిని పట్టుకోవడం పెద్ద టాస్క్ గా మారింది. గతంలో చీఫ్ సెక్రటరిగా ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు ఆయన అనుమానం ఉన్న ఉద్యోగుల ఇంటికి నేరుగా వెళ్లి పరిశీలన చేసేవారు. అప్పట్లో పలువురు ఇలా మతం మారిన ఉద్యోగుల్ని పట్టుకున్నవారు. తర్వాత ఆయన హఠాత్తుగా బదిలీ అయ్యారు. 

నవంబర్ 18, 2024 టీటీడీ బోర్డు తీర్మానం, ఎండోమెంట్ యాక్ట్ 1060, 1989 ప్రకారం హిందూమత సంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి టీటీడీలో ఉద్యోగం పొందిన కొందరు ఉద్యోగులు నేడు అన్యమతాన్ని అభ్యసిస్తూ… భక్తుల మనోభావాలను, టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నారని టీటీడీ బోర్డు ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.  హిందూ మతేతర కార్యక్రమాల్లో పాల్గొంటూనే, టీటీడీ ఉత్సవాల్లోనూ పాల్గొంటే ఇక కఠిన చర్యలు తీసుకుంటారు.  అన్యమత ఉద్యోగుల్లో ఎవరైనా తిరుమల, టీటీడీ అనుబంధ ఆలయాల్లో, ఆలయ అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నట్లయితే వెంటనే బదిలిలో చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై సదరు ఉద్యోగులను టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు ఇతర హిందూ కార్యక్రమాల విధులకు నియమించకూడదని ఆదేశించారు. అన్యమత ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ లేదా విఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపాలని ఇటీవల టీటీడీ బోర్డు తీర్మానం చేసింది.                

Also Read: రామ్మోహన్‌నాయుడిని పొగడ్తలతో ముంచెత్తిన ఎమ్మెస్కే.. మానవతావాది అంటూ కితాబు