Telangana Rythu Bharosa Status: తెలంగాణ వ్యవసాయ రంగంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. రైతు భరోసా నిధులు ఎప్పుడు వస్తాయి పాత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు స్థానంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన ఈ కొత్త పథకం ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది. ఎకరం లోపు ఉన్న వారికి పడ్డాయి. మరి రెండు ఎకరాల దాటిన వారి పరిస్థితి ఏంటి?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక, గతంలో ఉన్న రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది. కేవలం పేరు మార్చడమే కాదు, పెట్టుబడి సాయాన్ని కూడా పెంచింది. ఏటా ఎకరానికి 12వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ పథకం నిధుల పంపిణీ స్టాగర్డ్ మేనర్ అంటే విడుదల వారీ పద్ధతిలో సాగుతోంది.
మొన్నటి వరకు యాసంగి(రబీ) సీజన్కు సంబంధించిన నిధుల పంపిణీ కొనసాగుతోంది. ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు తొలి ప్రాధాన్యత ఇస్తోంది. మార్చి 22న మొదటి విడత నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నెర్మెట్ట వేదికగా విడుదల చేశారు. ఎకరం, అంతకంటే తక్కువ భూమి ఉన్న సుమారు 68 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల మధ్య సాగు భూమి ఉన్న మిడ్సైడ్ రైతుల కోసం ప్రభుత్వం దాదాపు 2,063 కోట్లు విడుదల చేసింది. అందరి కళ్లు ఇప్పుడు మూడో విడతపైనే ఉన్నాయి. రెండు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న పెద్ద రైతులకు సంబంధించిన సుమారు 3500 కోట్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. జూన్ నెల ప్రారంభమైనప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిధుల సమీకరణ, అర్హుల వడపోతపై అధికారులు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు.
ఖరీఫ్ కోసం కొత్త నిబంధనలు
జూన్ నెల రావడంతో వానాకాలం సాగు పనులు మొదలవుతున్నాయి. అయితే ఈసారి ప్రభుత్వం నిధుల పంపిణీలో మరింత పారదర్శకత కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో సాగు చేయని భూములకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా పెట్టుబడి సాయం అందిందనే విమర్శలు ఉన్నాయి. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం భూ భారతి వెరిఫికేషన్, శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అంటే శాటిలైట్ ద్వారా మీ భూమిలో పంట సాగవుతోందా లేదా ని పరిశీలించి కేవలం సాగులో ఉన్న భూములకే నిధులు ఇస్తారు.
రైతులు చేయాల్సిన పనులు
మీరు రైతు భరోసా సాయం పొందాలంటే రెండు పనులు కచ్చితంగా చేయాలి. మీ బ్యాంకు ఖాతాకు ఈకేవైసీ చేయాలి. బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డు కచ్చితంగా లింక్ చేయాలి.
స్టేటస్ ఎలా చెక్ చేయాలి.
మీకు రావాల్సిన డబ్బులు ఏ స్టేజీలో ఉన్నాయో తెలుసుకోవడం చాలా సులభమైన పని. ముందుగా తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారిక పోర్టల్ను విజిట్ చేయాలి. అక్కడ మీ కొత్త పట్టాదార్ పాస్ బుక్ నంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ అప్లికేషన్ ల్యాండ్ వెరిఫికేషన్ ఏ స్టేజీలో ఉందో కనిపిస్తుంది. గత మార్చి లేదా ఏప్రిల్లో మీకు నగదు జమ అయిందో లేదో కూడా హిస్టరీ తెలుసుకోవచ్చు.
తెలంగాణ ప్రభుత్వం యాసంగి పెండింగ్ నిధులను క్లియర్ చేసిన వెంటనే వానాకాలం కొత్త విడత నిధులపై స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. రైతు సోదరులు తమ డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవడం ద్వారా నిధుల పంపిణీ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించవచ్చు. సాగు సాయం పక్కగా అర్హులైన వారికే చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యంలా కనిపిస్తోంది.
