రైతుల సమస్యల మీద రైతు స్వరాజ్య వేదిక వాళ్ళు చేస్తున్న ఆరోపణల మీద సమీక్ష చేసుకోవాలని, కానీ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి రైతు బంధు సమితి అధ్యక్షుడు కాదని, రైతుల రాబందు సమితి అధ్యక్షుడు అని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ మండిపడింది. రైతు స్వరాజ్య వేదిక మీద పల్లా రాజేశ్వర్ రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడారని, ఆ వ్యాఖ్యల్ని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి సుంకేట ఖండించారు. రాష్ట్రంలో పంట నష్టం జరగనే లేదని రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతుంటే ఆయనను రైతు బంధు సమితికి అధ్యక్షుడ్ని ఎలా చేశారో సీఎం కేసీఆర్ ఆలోచించుకోవాలన్నారు.


2022 ఫిబ్రవరి లో వర్షాలతో పంట నష్టపోతే వరంగల్ జిల్లాకు మీ మంత్రులు వెళ్ళింది నిజం కాదా ? మీరు చెబుతున్నట్లు పంట నష్టం జరగకపోతే మీ మంత్రులు ఆ సమయంలో విహార యాత్రకు వెళ్లినట్లా అని ప్రశ్నించారు. 2022 జూన్ లో భారీ వర్షాలతో రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో నష్టం జరిగిందన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం పంట నష్టం జరిగితే కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వలన పంటల బీమా ద్వారా రైతులకుఅందాల్సిన పరిహారం సైతం దక్కడం లేదని, మీ నిర్లక్ష్యం వల్లే రాలేదు అని కోర్టు చెప్పిన సంగతి మరచి పోయారా అని నిలదీశారు. 


2021 నవంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు కేవలం పంటలలో నష్టం వచ్చి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఆ ఆత్మహత్యలు మీకు కనిపించకపోతే మేము ఆ కుటుంబాలను చూపిస్తాం, వచ్చే దమ్ము బీఆర్ఎస్ నేతలకు ఉందా అని సవాల్ విసిరారు. నాలుగు సంవత్సరాలుగా రుణమాఫీ ఏకకాలంలో చేయకపోవడం వలన వడ్డీలు పెరిగి కొత్త రుణాలు దొరకక ఎన్నో లక్షల మంది రైతులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. 


కేవలం పంటల రుణమాఫీ చేయకపోవడం వల్ల దాదాపు 16 లక్షల మంది రైతులు డిఫాల్టర్స్ గా మారి ఏ బ్యాంకులు రుణం ఇవ్వని పరిస్థితికి కేవలం ప్రభుత్వ అసమర్థత కారణం అన్నారు. ఆరోపణలు చేసిన వారిపై నోటికొచ్చినట్లు మాట్లాడితే కేసీఆర్ దగ్గర మెప్పు పొందుతారేమో, కానీ రైతుల దృష్టిలో  రైతు వ్యతిరికిగా నిలిచిపోతారని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సుంకేట ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


రైతు బంధు నగదు జమ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ ట్రెజరీ అధికారిక వెబ్ సైట్ https://treasury.telangana.gov.in/ కు వెళ్లండి
హోం పేజీ మెనూ బార్‌లో రైతుబంధు స్కీమ్ ఖరీఫ్ డీటైల్స్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి
అనంతరం రైతు బంధు అందుకునే సంవత్సరం, టైప్, పీపీబి నెంబర్ సెలక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి
స్కీమ్ వైజ్ రిపోర్ట్ ఎంచుకుని మీ వివరాలు ఇవ్వాలి
వివరాలు మొత్తం ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు రైతు బంధు నగదు వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు.
అయితే నేడు రైతులకు నగదు ప్రారంభించారు కనుక మరికొన్ని రోజుల్లో అధికారులు ఈ వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తారు.
ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2018, మే 10న కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి - ఇందిరానగర్‌ వద్ద ప్రారంభించారు. తొలిసారిగా ధర్మరాజుపల్లి వాసులు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చెక్కులు, పట్టాదార్‌ పాసు పుస్తకాలు అందుకున్నారు. అప్పటినుంచి రాష్ట్రంలో రైతు బంధు కొనసాగుతుండగా.. డిసెంబర్ 28 నుంచి రైతులకు తాజా విడుత నగదు సాయం ప్రారంభించారు.