Telangana News: తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కారు రైతుల రుణమాఫీకి సిద్దమైంది. ఇవాళ(గురువారం) సాయంత్రం నాలుగు గంటలకు తొలి విడతలో లక్ష లోపు రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేయబోతోంది. సచివాలయంలోని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి క్లిక్ చేయగానే నేరుగా రైతులు ఖాతాల్లోకి ఏకకాలంలో రుణమాఫీ సొమ్ము జమ కానుంది. సుమారుగా 11.42 లక్షల మంది లబ్ధిదారులకు రుణమాఫీ కింద సుమారు ఏడు వేల కోట్లు ప్రభుత్వం చెల్లించనుంది.


మూడు విడతల్లో మాఫీ 


రైతులు మూడు కేటగిరీలుగా విభజించి రుణమాఫీ చేయాలని సర్కారు నిర్ణయించింది. తొలి విడతలో లక్షలోపు రెండో విడతలో లక్ష యాభై వేలు వరకు, మూడో విడతలో 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయనుంది. బ్యాంకులు, పిఎసిఎస్ నుంచి ఇప్పటికే సేకరించిన వివరాలన్నింటినీ నేషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మొత్తంగా రుణమాఫీ పరిధిలోకి వచ్చే రైతు కుటుంబాలు 40 లక్షలు ఉన్నట్లు లెక్క తేలింది. లక్షలోపు రుణాలు ఉన్న రైతులు వివరాలను జిల్లాల వారీగా బుధవారం సాయంత్రమే కలెక్టర్లు, డిఎవోలకు పంపించారు.


కుబేర్ సాఫ్ట్వేర్ ద్వారా మాఫీ


ప్రజాభవన్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించింది. లక్షలోపు రుణమాఫీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం దిశా నిర్దేశం చేశారు. మాఫీ అయిన మేరకు మళ్ళీ కొత్తగా పంట రుణాలు ఇవ్వడంపై ఆదేశాలు ఇచ్చారు. రైతు బంధు మాదిరిగానే ఈ కుబేర్ సాఫ్ట్వేర్ సాయంతో రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఇప్పటికే ప్రొసీడింగ్స్ తీసి ట్రెజరీకి పంపించారు.


రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు


రుణమాఫీకి శ్రీకారం చుట్టే కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన 20 మంది రైతులకు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు కలిసి చెక్కులు పంపిణీ చేస్తారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ నెలాఖరులోపు రూ.1.5 లక్షలు వరకు ఉన్న రుణాలు ఆగస్టు మొదటి వారంలో రెండు లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.


ఆగస్టు 15 కల్లా మాఫీ


మొత్తం రుణమాఫీకి రూ.31 వేల కోట్ల అవసరమవుతాయని అంచనాలు ఉండగా, ప్రస్తుతం వెచ్చిస్తున్న రూ.7 వేలు కోట్లు కాకుండా మరో రూ.24 వేల కోట్లను ప్రభుత్వం సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఖరీఫ్ సీజన్లోనే రుణమాఫీ పూర్తి చేస్తే మళ్లీ రైతుల పంట రుణం తీసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే పంద్రాగస్టులోపు రైతులు రుణం నుంచి విముక్తులు కానున్నారు.


ఈ సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికలు, మండల కేంద్రాల్లో సంబరాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది. రుణమాఫీ నిధులు జమ చేసిన రైతులను ఉద్దేశించి సీఎం రేవంత్ మాట్లాడనున్న వేళ రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు సిద్ధం చేశారు. ఎక్కడకక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఈ సంబరాల్లో పాల్గొననున్నారు. 


రుణమాఫీకి ఎన్సీడీసీ రుణం తీసుకోబోతున్న రేవంత్ సర్కార్..


రుణమాఫీకి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) రుణం తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.  ఇవాళ్టి నుంచి రైతుల రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలని సంకల్పించిన రేవంత్ సర్కార్ ఆర్థిక వనరులను సమకూర్చుకునే దిశలో తీవ్ర ప్రయత్నాలను చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే రైతు రుణమాఫీ పథకానికి మొత్తం రూ.31 వేల కోట్లు అవసరమవుతాయని ప్రాథమిక అంచనా. ఇప్పటికే భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిర్వహించే ఈ వేలం ద్వారా ప్రతినెల సేకరించే మార్కెట్ రుణాలు, రాష్ట్ర రాబడుల నుంచి కొంత మేర నిధులను ఆదా చేస్తూ.. రుణమాఫీ కోసం దాదాపు రూ.10 వేల కోట్లకుపైగా ఖజానాలో జమ చేసినట్టు తెలిసింది. ఈ  క్రమంలో మరో రూ.5 వేల కోట్లు సేకరించేందుకు ఎన్సీడిసీ రుణాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ రుణం నిధులను జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసిసిబి) ద్వారా రుణమాఫీకి వినియోగించాలని యోచిస్తోంది. అయితే, ఎన్సిడిసి నుంచి ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆమోదం లభించలేదని తెలుస్తోంది. కేంద్ర సహకార శాఖను పర్యవేక్షిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సంప్రదింపు జరుపుతున్నట్లు తెలుస్తోంది.


రూ.5000 కోట్ల రుణం కోసం ప్రయత్నాలు 


రాష్ట్రంలోని తొమ్మిది జిల్లా సహకార బ్యాంకులు, 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ద్వారా రైతులకు ఇచ్చిన పంట రుణాలు దాదాపు 5 వేల కోట్ల వరకు ఉన్నాయి. ఈ బ్యాంకులు, సంఘాలు, తెలంగాణ సహకార అపెక్స్ బ్యాంకు (టీజిసీఏబి)కు అనుసంధానమై ఉంటాయి. అందుకే ఎన్సీడీసీ నుంచి ముందుగా టిజిసిఏబి ఈ రూ.5000 కోట్ల రుణాన్ని తీసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. టీజీసిఏబి నుంచి జిల్లా సహకార బ్యాంకులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు రుణం సొమ్మును మళ్ళించాలని సర్కారు యోచిస్తోంది. దేశంలో సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన ఎన్సిడిసి రాష్ట్రాల్లోని టిజిసిఏబి వంటి బ్యాంకులకు రుణాలు ఇస్తుంటుంది.


కానీ, ఈసారి రాష్ట్ర ప్రభుత్వమే మధ్యత్వం నెరుపుతూ టీజీసీఏబికి రూ.5000 కోట్ల రుణం ఇప్పించాలని ప్రయత్నిస్తోంది. ఈ రుణం లభిస్తే రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించనున్నది. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ విషయంలో ముందుకు వెళుతూ ఉండడం పట్ల రైతాంగం నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. మూడు విడతల్లో సుమారు రూ.31 వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ పథకాన్ని అమలు చేసేందుకు అనుగుణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం శరవేగంగా కదులుతుండడం కీలక పరిణామంగానే పలువురు విశ్లేషిస్తున్నారు.