PM Kisan Samman Nidhi 21th Installment: దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళికి ఒక్క రోజు ముందైనా పీఎం కిసాన్ నిధులు జమ చేయాలని భావిస్తోంది. అక్టోబర్ 20న దీపావళి దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఈ లోపే రైతులకు కిసాన్ పథకానికి సంబంధించిన 21వ విడత నిధులు జమ చేయనున్నట్టు లీకులు వస్తున్నాయి.
ప్రధాన మంత్రి కిసాన్ పథకం ద్వారా కేంద్రం రైతులకు సాయం చేస్తోంది. ఏటా 6వేల రూపాయలు అందజేస్తోంది. ఇది మూడు విడతల్లో ఇస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి జులైలో ఇవ్వాల్సిన రెండు వేల రూపాయలను ఆగస్టులో ఇచ్చింది. ఇప్పుడు యథావిధిగా అక్టోబర్లో ఇవ్వాల్సిన నిధులను ఇచ్చేయనుంది కేంద్రం. అక్టోబర్ 18న రెండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికి ఇరవై దఫాలుగా రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయల చొప్పున నగదు వేశారు. ఇప్పుడు ఈ అక్టోబర్లో 21వ విడత నిధులు వేయనున్నారు.
జీఎస్టీలో మార్పులు చేర్పులు చేసిన కేంద్రం వాటిని ఈ నెల 22 నుంచి అమల్లోకి తీసుకొస్తోంది. మరోవైపు బిహార్ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. అందుకే వీలైనంత త్వరగా డీబీటీలను అమలు చేయాలని చూస్తోంది. అందుకే పీఎం కిసాన్ డబ్బులను కూడా దీపావళి కానుకగా విడుదల చేస్తే రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తుందని కేంద్రం భావిస్తోంది. ఆ దిశగా చర్యలు చేపడుతోంది. ఈ ఏడాదిలో మొదటి విడత ఆలస్యమైనా, మిగతావి సరైన సమయంలో వేయాలని చూస్తోంది. గత సినారియో చూస్తే కూడా అక్టోబర్లో రైతు కిసాన్ నిధులు వేసిన సందర్భాలు ఉన్నాయి.
ఇంకా నిధుల జమపై అధికారిక ప్రకటన వస్తుందో లేదో తెలియదు కానీ ఈ లోపు రైతులు చేయాల్సిన కొన్ని పనులు మాత్రం మర్చిపోవద్దు. లేకుంటే నిధులు ప్రభుత్వం విడుదల చేసినా మీ ఖాతాల్లో పడకపోవచ్చు. తర్వాత ఎన్ని ఫిర్యాదులు చేసిన ప్రయోజనం లేకుండా పోవచ్చు. అర్హత ఉండి కూడా నిధులు జమ కాని రైతులు ముందుగా ఈ కేవైసీ చేయించుకోవాలి. ఆధార్ నెంబర్తో బ్యాంకు ఖాతాలను లింక్ చేసుకోవాలి.
- ముందుగా PM కిసాన్ అధికారిక వెబ్సైట్కి వెళ్లండి.
- ఈ పేజీలోని రైతు కార్నర్లోని లబ్ధిదారుల స్టాటస్పై క్లిక్ చేయండి
- ఇప్పుడు మీ ఆధార్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ను నమోదు చేయండి.
- దీనితో పాటు,'లబ్ధిదారుల జాబితా' ఆప్షన్కు వెళ్లి మీ గ్రామం పూర్తి జాబితా చూడవచ్చు.
PM కిసాన్ యోజన అనేది భారత ప్రభుత్వ పథకం. ఈ పథకం 1డిసెంబర్ 2018న ప్రారంభించారు. రైతులకు ఆర్థిక మద్దతు అందించి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా దేశంలోని రైతులకు అండగా నిలవాలనేది దీని ముఖ్య లక్ష్యం. గరిష్టంగా 2 హెక్టార్ల వ్యవసాయ యోగ్యమైన భూమిని కలిగి ఉండి, ఇంతకు ముందు ఈ పథకం కింద నమోదు చేసుకోని రైతులు కొత్తగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ పథకం అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయవచ్చు.