నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి రైతుల నుంచి మద్దతు పెరుగుతోంది. స్వచ్చందంగా ముందుకు వచ్చి తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ కు విరాళాలు అందించి మద్దతు తెలుపుతున్నారు రైతులు.  వేల్పూర్ మండలానికి చెందిన వివిధ గ్రామాల నుంచి రైతులు లక్షా 50వేల 116 రూపాయలను విరాళంగా అందజేశారు. రాష్ట్రం వచ్చాక, కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణలో రైతు గోసలు పోయాయని రైతులు పేర్కొన్నారు. రైతు బంధు, రైతు భీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, పుష్కలంగా సాగు నీరు అందించి రైతును రాజుగా చేశాడని కొనియాడారు.

రైతులకు పెట్టుబడి సాయం.. ధాన్యం కొనుగోలు

పెట్టుబడి సాయం ఇవ్వడమే కాకుండా... రైతు పండించిన ధాన్యాన్ని కూడా కొంటున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని అన్నారు. తెలంగాణ రైతుల లెక్కనే దేశమంతటా రైతులు సంబురంగా ఉండాలంటే కేసీఆర్ ప్రధాని కావాలని బాల్కొండ నియోజకవర్గం రైతులు ఆకాంక్షించారు. రైతులకు, పేదలకు ఏం కావాలో కేసీఆర్ కు మాత్రమే తెలుసని, భారత దేశానికి ఆయన నాయకత్వం అవసరమని అన్నారు. గతంలో బాల్కొండ, ఆర్మూర్ ప్రాంత రైతుల కోసం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి, రైతు నాయకుడు వేముల సురేందర్ రెడ్డి చేసిన సేవలు ఈ సందర్బంగా అన్నదాతలు గుర్తు చేసుకున్నారు. ఆయన కుమారుడు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ లో చెక్ డ్యాంలు నిర్మించి రైతుల సాగునీటి గోసలు తీర్చారని గుర్తు చేసుకున్నారు.

రైతులకు చేసిన మేలు ఎన్నడూ మర్చిపోమని దేశానికి మంచి చేయాలని బయలు దేరిన సీఎం కేసీఆర్ కి, ఆయన సహకారంతో బాల్కొండను అభివృద్ది చేస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. కేసిఆర్ జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితికి  స్వచ్చందంగా విరాళాలు అందించి మద్దతు పలికిన వేల్పూర్ మండలానికి చెందిన రైతులకు  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతులు, పేదలు కేంద్రంగానే కేసిఆర్ పాలన ఉంటుందని మంత్రి వేముల చెప్పారు.