PM Kisan Yojana And Annadata Sukhibhav 2025: ఆగస్టు 2వ తేదీన అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ పియం కిసాన్ నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు.ఈ అంశంపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రైతులకు ఆర్దికంగా మరింత చేయూతను అందించే లక్ష్యంతో సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి 20వేల రూపాయాలు వంతున అన్నధాత సుఖీభవ-పియం కిసాన్ కింద సహాయం అందించడం జరుగుతోందని తెలిపారు.
ఈ పథకానికి సంబంధించి ఇంకా ఇ-కెవైసి, ఎన్సిపిఐ మ్యాపింగ్ కానివారు వెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రాలను సంప్రందించి ఇ-కెవైసి, మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని చెప్పారు. ఈ పథకం అమలుకు ఇంకా మరో మూడు రోజులు వరకూ సమయం ఉన్నందున ఈ రెండు అంశాలు పెండింగ్లో ఉన్న రైతులందరూ తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని ఆయన సూచించారు.
భూమి లేని సీసీఆర్సీ కార్డు కలిగిన కౌలు రైతులు ఇ-క్రాపు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని వారికి అక్టోబరు మాసంలో ఇచ్చే అన్నధాత సుఖీభవ-పియం కిసాన్ నిధులు అందుతాయని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు.వెబ్ ల్యాండ్ ,ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు ఇ-కెవైసి తప్పనిసరని వారికి ఆగస్టు 2వ తేదీన జమ చేసే అన్నధాత సుఖీభవ-పిఎం కిసాన్ నిధులు అందుతాయని ఆయన స్పష్టం చేశారు.
డబ్బులు పడాలంటే రైతులు ఇవి సరి చూసుకోవాల్సిందే
ఇంకా ఇ-కెవైసి,ఎన్సిపిఐ మ్యాపింగ్ కాని రైతులందరూ త్వరితగతిన వాటిని చేయించుకోవాలని ఆర్టీజిఎస్ ద్వారా ఆయా రైతులందరికీ సంక్షిప్త సందేశం(ఎస్ఎంఎస్) పంపాలని ఆర్టీజిఎస్ సిఇఓను సిఎస్ విజయానంద్ ఆదేశించారు.అన్నధాత సుఖీభవ-పియం కిసాన్ పథకానికి అనర్హులుగా గుర్తించి తిరస్కరించిన వారికి ఎందుకు అనర్హులుగా గుర్తించి తిరస్కరించడం జరిగిందనే దానిపై వ్యవసాయశాఖ అధికారులు రైతు సేవా కేంద్రాల ద్వారా స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు. అంతేగాక తిరస్కరించిన వారి వివరాలను రానున్న మూడు రోజుల్లో అనగా ఆగస్టు 1వ తేదీలోగా మరొకసారి క్షుణ్ణంగా పరిశీలన జరిపి ఎక్కడైనా అర్హత గల వారిని గుర్తిస్తే వెంటనే వారిని అర్హుల జాబితాలో చేర్చాలని స్పష్టం చేశారు. కొంతమంది రైతులకు సంబంధించిన భూమి మ్యూటేషన్ ప్రక్రియ చేయకపోవడం, ఆధార్ సీడింగ్ సరిగా నమోదు కాకపోడవం,చనిపోయిన వారికి సంబంధించిన అంశాలపై రెవెన్యూ శాఖ తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఈపథకం వర్తించలేదని రైతుల నుంచి ఫిర్యాదులు వస్తుంటాయని కావున వాటిపై రెవెన్యూశాఖ అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.దీనిపై గురువారం నిర్వహించే కలెక్టర్ల వీడియో సమావేశంలో కూడా చర్చించినట్టు సిఎస్ విజయానంద్ పేర్కొన్నారు.
అంతకు ముందు వ్యవసాయశాఖ సంచాలకులు ఢిల్లీ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ పథకం అమలుకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ లబ్ది పొందాలంటే ఇ-పంట, ఇ-కెవైసిలో నమోదు తప్పనిసరని స్పష్టం చేశారు. అన్నధాత సుఖీభవ-పియం కిసాన్ కు సంబంధించి రైతులు వారి స్టేటస్ ను అన్నదాత సుఖీభవ పోర్టల్, మన మిత్ర వాట్సప్ గవర్నెస్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబరు 155251 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు.
ఇంకా ఈసమావేశంలో రాష్ట్ర వ్యవసాయ,పశుసంవర్ధక,మత్స్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఆర్థిక శాఖ కార్యదర్శి వి.వినయ్ చంద్,అదనపు సిసిఎల్ఏ ప్రభాకర్ రెడ్డి,ఆర్టీజిఎస్ సిఇఒ ప్రఖర్ జైన్,యుబిఐ ఎజియం శ్రీనివాస్ పాల్గొన్నారు.అలాగే వర్చువల్ గా సిసిఎల్ఏ జయలక్ష్మి,సియం కార్యదర్శి రాజమౌళి,పలువురు బ్యాంకరులు పాల్గొన్నారు.