విద్యుత్‌ కోతలు, సంక్షోభం, కొనుగోలుపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌ డిమాండ్, సప్లై, పూర్తిచేయాల్సిన ప్రాజెక్టులు, భవిష్యత్‌లో చేపట్టనున్న ప్రాజెక్టులపై ఆరా తీశారు. విద్యుత్‌రంగంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను సీఎంకు వివరించారు అధికారులు. దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు సరఫరా సంక్షోభం, విద్యుత్‌ ఉత్పత్తి రంగంపై పడ్డ ప్రభావంపై కూడా ప్రజంటేషన్ ఇచ్చారు. అంతర్జాతీయంగా, దేశీయంగా వచ్చిన పరిణామాలతో బొగ్గుకు తీవ్ర కొరత ఏర్పడిందన్నారు. బొగ్గు సరఫరాలో అంతరాయంతో పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు ఉన్నాయని పేర్కొన్నారు. సరిపడా రైల్వే ర్యాక్స్‌ను సరఫరా చేయలేకపోవడం, వెసల్స్‌ కూడా తగినంతగా అందుబాటులో లేకపోవడం, విదేశాల్లో బొగ్గు ధరలు విపరీతంగా పెరగడం వంటి కారణాలతో విద్యుత్తు సంక్షోభం ఏర్పడిందన్నారు అధికారులు.


విద్యుత్ సంక్షోభానికి తోడు డిమాండు కూడా గతంలో కన్నా అనూహ్యంగా పెరిగిందన్నారు అధికారులు. గడచిన మూడేళ్లుగా వర్షాలు బాగా కురిశాయని, భూగర్భజలాలు, బావుల్లో నీళ్లు పుష్కలంగా ఉండడం వల్ల వ్యవసాయరంగం నుంచి కూడా డిమాండ్‌ స్థిరంగా ఉందని వివరించారు. కోవిడ్‌ పరిస్థితుల తర్వాత పారిశ్రామిక ఉత్పత్తిరంగం పుంజుకుందని ఇక్కడ కూడా అధికంగా విద్యుత్ వినియోగం ఉందని తెలిపారు. వేసవి ఉష్ణోగ్రతలు కూడా అధికస్థాయిలో ఉన్నాయని ఫలితంగా అధిక వినియోగం ఉందని అభిప్రాయపడ్డారు. ఏప్రిల్‌ 8న అత్యధికంగా రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ 12,293 మిలియన్‌ యూనిట్లకు చేరిందని.. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక డిమాండ్‌ ఇదేనన్నారు. 


ఎంత ఖర్చైనా కొనుగోలు 
త భారీగా సంక్షోభంలో ఉన్నప్పటికీ వినియోగదారులకు ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో భారీ ఎత్తన విద్యుత్తు కొనుగోలు చేసిన విషయాన్ని సమావేశంలో సీఎంకు తెలిపారు అధికారులు. మార్చిలో సగటున రోజుకు రూ.36.5 కోట్లు ఖర్చు చేస్తే.. ఏప్రిల్‌లో సగటున రోజుకు రూ.34.08 కోట్లు వెచ్చించినట్టు లెక్కలు చెప్పారు. మార్చి నెలలో 1268.69 మిలియన్‌ యూనిట్లను రూ.1123.74 కోట్లు, ఏప్రిల్‌లో 1047.78 మిలియన్‌ యూనిట్లు రూ.1022.42 కోట్లతో కొన్నామని తెలిపారు అధికారులు.


బొగ్గు విషయంలో రానున్న రెండేళ్లు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయన్న సంకేతాలు కేంద్రం నుంచి వచ్చాయని సీఎంకు వివరించారు అధికారులు. జనరేషన్‌ ప్లాంట్లకు కావాల్సిన బొగ్గులో కనీసం 10 శాతం వరకూ విదేశాల నుంచి తెచ్చుకోవాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులు నొక్కిచెప్తున్నారన్నారు. డిమాండ్‌ను అంచనా వేసుకుని ఆ మేరకు కార్యాచరణ చేసుకోవాలని సూచించారు సీఎం. బొగ్గు కొనుగోలు విషయంలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలన్నారు.


పీక్‌ సమయాల్లోనూ మిగులు విద్యుత్తు 
సెకీతో ఒప్పందం కారణంగా సుమారు 45 మిలియన్‌ యూనిట్లు రాష్ట్రానికి దశలవారీగా అందుబాటులో వస్తోందన్నారు సీఎం. మూడు సంవత్సరాల్లో మొత్తం మూడు దశల్లో అందుబాటులోకి సెకీ విద్యుత్తు వస్తోందని వివరించారు. 2023 చివరి నాటికి  మొదటి దశలో సుమారు 18 మిలియన్‌ యూనిట్లు, రెండో దశలో సుమారు 18 మిలియన్‌ యూనిట్లు, మూడో దశలో సుమారు 9 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ వినియోగంలోకి వస్తుందన్నారు. 


రాష్ట్రంలో కృష్ణపట్నంలో కొత్తగా 800 మెగావాట్లు, వీటీపీఎస్‌లో కొత్తగా 800 మెగావాట్ల ధర్మల్‌ విద్యుత్‌ యూనిట్లు అందుబాటులోకి వస్తున్నాయని కూడా తెలిపారు జగన్. 85శాతం పీఎల్‌ఎఫ్‌ అంచనా వేసుకుంటే మరో 30 మిలియన్‌ యూనిట్లు అందుబాటులోకి వస్తుందన్నారు. మొత్తంగా 48 మిలియన్‌ యూనిట్లు అతిత్వరలో రాష్ట్రానికి అందుబాటులోకి వస్తోందని వివరించారు. సీలేరులో కొత్తగా 1350 మెగావాట్ల కొత్త ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తిచేయడానికి దృష్టిపెట్టాలని అధికారులకు ఆదేశించారు. డీపీఆర్‌ పూర్తయ్యిందని, త్వరలోనే టెండర్లు పిలుస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. 


కృష్ణపట్నం నుంచి 800 మెగావాట్ల విద్యుత్తు


జులై–ఆగస్టు కల్లా కృష్ణపట్నం విద్యుత్తు వినియోగదారులకు అందనుందని తెలిపారు అధికారులు. విజయవాడ థర్మల్‌ కేంద్రంలో 800 మెగావాట్ల విద్యుత్పత్తి పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. పోలవరం పవర్‌ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని... ఇప్పటికే టన్నెల్స్‌ తవ్వకం పూర్తయ్యిందన్నారు అధికారులు. ఈ ప్రాజెక్టుల వల్ల పెద్ద ఎత్తున మిగులు విద్యుత్తు సాధించగలుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. 


పారిశ్రామిక రంగానికి నిరంతర విద్యుత్తు 
ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల పరిస్థితులు రాకుండా చూడాలని అధికారులుక హితవు పలికారు సీఎం జగన్. వారి డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్తును సరఫరాచేయాలన్నారు. ఈ విషయంలో పారిశ్రామిక రంగ వ్యక్తులతో కలిసి ఒక కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. వచ్చే వేసవిలో ఇలాంటి సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలిని దిశానిర్దేశం చేశారు. 


ప్లాంట్ల నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు 


జెన్‌కో ఆధ్వర్యంలో ఉన్న  ప్లాంట్లను అత్యుత్తమ సామర్థ్యంతో నిర్వహించాలన్నారు సీఎం జగన్. 85శాతం పీఎల్‌ఎఫ్‌ సామర్థ్యంతో నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనివల్ల నాణ్యమైన విద్యుత్తు, మంచి ధరకే అందుబాటులోకి వస్తోందన్నారు. విద్యుత్‌ ఉత్పత్తి ఖర్చులు తగ్గించేలా ఆలోచనలు చేయాలని కూడా సూచించారు. ఖర్చులు తగ్గినా ఆదాయం వచ్చినట్టేనని లెక్కలు వేశారు.  


పంప్డ్‌ స్టోరేజీ హైడ్రో ఎలక్ట్రికల్‌ ప్రాజెక్టులతో భరోసా


విద్యుత్‌ ఉత్పత్తి రంగంలో ప్రపంచవ్యాప్తంగా పలు మార్పులు వస్తున్నాయన్న సీఎం.. పర్యావరణహిత విధానాలతో విద్యుత్‌ ఉత్పత్తికి సిద్దమవ్వాలన్నారు. బొగ్గు ఆధారిత ప్లాంట్ల నుంచి ప్రపంచం తప్పుకుటుందుని... ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ విధానాలు అవసరమని అభిప్రాయపడ్డారు. దీనికి పంప్డ్‌ స్టోరేజీ హైడ్రో పవర్‌ ప్రాజెక్టులు విద్యుత్‌ రంగంలో ఉత్తమ ప్రత్యామ్నాయ పద్ధతిగా అభివర్ణించారు. రాష్ట్రంలో 29 చోట్ల ఈ ప్రాజెక్టులకు అవకాశాలున్నాయని దానిపై దృష్టిపెట్టాలన్నారు. భూ సేకరణ దగ్గర నుంచి అన్నిరకాలుగా సిద్ధం కావాలన్నారు. ప్రతిపాదిత ప్రాజెక్టులు పూర్తైతే 33,240 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వస్తుందని అంచనా వేశారు. పీక్‌ అవర్స్‌లో అధిక ఖర్చుకు విద్యుత్తు కొనుగోలు చేసే ఇబ్బందులు, పంప్డ్‌ స్టోరేజీ హైడ్రో ఎలక్ట్రికల్‌ ప్రాజెక్ట్‌ వల్ల తొలగిపోతాయని వివరించారు. ఒక్కసారి ప్రాజెక్టు పెట్టిన తర్వాత గరిష్టంగా 90 ఏళ్లపాటు ఆ కరెంటు అందుబాటులో ఉంటుందన్నారు. 



రైతులకే ఉచిత విద్యుత్‌ డబ్బులు


ఉచిత విద్యుత్‌ డబ్బు రైతుల ఖాతాల్లోకి వేసి వారి ద్వారానే డిస్కంలకు చెల్లించేలా ప్లాన్ చేయాలన్నారు సీఎం జగన్. ఎక్కడ ఇబ్బంది వచ్చినా.. దీనివల్ల విద్యుత్తు సేవలకు సంబంధించి రైతు ప్రశ్నించగలుగుతాడన్నారు. విద్యుత్తు శాఖ కూడా రైతుల నుంచి వచ్చే అభ్యంతరాల పరిష్కారంపై నిరంతరం ధ్యాస పెట్టగలుగుతుందన్నారు. జవాబుదారీతనం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. మీటర్లు కాలిపోవడం, మోటార్లు కాలిపోవడం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా నాణ్యమైన కరెంటు అందడంతోపాటు మంచి సేవలు రైతులకు అందుతాయన్నారు. 


శ్రీకాకుళంలో పైలట్‌ ప్రాజెక్టు విజయవంతం
రైతు ఖాతాల్లోకే ఉచిత విద్యుత్ డబ్బులు వేసే పైలట్‌ ప్రాజెక్టు శ్రీకాకుళంజిల్లాలో విజయవంతమైందన్నారు అధికారులు. జిల్లాలో ఉచిత విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు అమర్చామని, రైతుల ఖాతాల నుంచి చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 26,083 కనెక్షన్లకు 101.51 మిలియన్‌ యూనిట్ల కరెంటు ఖర్చైందని తెలిపారు. 2021– 2022 ఆర్థిక సంవత్సరంలో కనెక్షన్లు పెరిగి 28,393కు చేరుకున్నాయని వివరించారు. అయినా 67.76 మిలియన్‌ యూనిట్ల కరెంటు మాత్రమే వినియోగించారని తెలిపారు అధికారులు. సంస్కరణల వల్ల, రైతుల ఖాతాల ద్వారా చెల్లింపులు వల్ల కనెక్షన్లు పెరిగినా 33.75 మిలియన్‌ యూనిట్ల కరెంటు ఆదా అయ్యిందని, రైతులకూ నాణ్యమైన విద్యుత్తు అందుతోందని తెలిపారు అధికారులు.