Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని, తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ "తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఆషాఢ మాస బోనాలు ప్రతీక. ఆషాఢ బోనాల వేళ రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో విలసిల్లాలని అమ్మవారిని కోరుకున్నాను. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలని కోరుకున్నాను. కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని అన్నారు. v
లష్కర్ బోనాలు జాతరను పురస్కరించుకొని 1వ తేదీ అర్ధరాత్రి 1:00 గంటల నుండి 4వ తేదీ ఉదయం వరకు నగరంలోని పలు కీలక రహదారులను పూర్తిగా మూసివేయనున్నారు. పొగాకు బజార్, హమాలీ విగ్రహం నుండి మహంకాళి ఆలయానికి వెళ్లే రహదారులతో పాటు సుభాష్ రోడ్, హిల్ స్ట్రీట్, అడవియ్య క్రాస్ రోడ్స్, జనరల్ బజార్ నుండి ఆలయానికి వెళ్లే దారుల్లో వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు.