Naveen Yadav Wins in Jubilee Hills By Election | పని చేయని సానుభూతి...జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక కాంగ్రెస్ కైవసం
సానుభూతి పనిచేయలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఏర్పడిన ఉపఎన్నికలో ఆయన సతీమణి మాగంటి సునీత పరాజయం పాలయ్యారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థి గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బరిలో నిలబడిన నవీన్ యాదవ్ భారీ మెజార్టీ తో గెలుపొందారు. మొదటి నుంచి నవీన్ ను వీధి రౌడీ, ఆకు రౌడీ అంటూ బీఆర్ఎస్ అటు ఆంధ్రా సెటిలర్లు, ఇటు మైనార్టీల ఓట్లు రాబట్టే ప్రయత్నం చేసినా ఆ పాచికలు పారలేదు. సీఎం రేవంత్ రెడ్డి మొదలు మంత్రి వర్గమంతా జూబ్లీహిల్స్ బైఎలక్షన్ ను సీరియస్ గా తీసుకుని ప్రచారం నిర్వహించటంతో నవీన్ యాదవ్ 24, 658 ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి మాగంటి సునీతపై సంచలన విజయం సాధించారు. ఫలితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. గతంలో కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ గెలుచుకోగా...ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం హస్తం పార్టీ కైవసం కావటంతో హైదరాబాద్ మహానగరంలో రెండు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ వశమయ్యాయి.