Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?

కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మేడారం జాతరలో అతిపెద్ద వింత.. అక్కడ అమ్మవార్ల విగ్రహాలు ఉండకపోవడం. గుడి, గోపురం, విగ్రహం ఏవీ లేని ఈ మహాజాతరలో కేవలం ఒక కుంకుమ భరిణెనే సాక్షాత్తూ సమ్మక్క తల్లిగా భావించి పూజిస్తారు. అసలు ఆ కుంకుమ భరిణె వెనుక ఉన్న అంతుచిక్కని కథేంటి?

వందల ఏళ్ల క్రితం కాకతీయ సైన్యంతో జరిగిన యుద్ధంలో సమ్మక్క వీరోచితంగా పోరాడింది. శత్రువులు వెన్నుపోటు పొడవడంతో తీవ్రంగా గాయపడిన ఆమె, రక్తం ఓడుతున్న శరీరంతోనే చిలుకలగుట్ట వైపు వెళ్ళింది. ఆమెను కాపాడుకోవాలని వెళ్లిన అనుచరులకు అక్కడ సమ్మక్క కనిపించలేదు. కానీ, ఆమె వెళ్ళిన చోట ఒక కుంకుమ భరిణె మరియు పులి అడుగుజాడలు మాత్రమే కనిపించాయి.

తల్లి సమ్మక్క ఆ కుంకుమ భరిణె రూపంలోనే ప్రకృతిలో కలిసిపోయిందని, ఆ భరిణెలోనే ఆమె శక్తి దాగి ఉందని గిరిజనులు నమ్ముతారు. అప్పటి నుండి ఆ కుంకుమ భరిణెనే సమ్మక్క ప్రతిరూపంగా కొలవడం ఆచారంగా మారింది.

జాతర సమయంలో అత్యంత కీలకమైన ఘట్టం సమ్మక్క తల్లిని గద్దెపైకి తీసుకురావడం. సాధారణ రోజుల్లో ఆ కుంకుమ భరిణె ఎక్కడ ఉంటుందో ఎవరికీ తెలియదు. గిరిజన పూజారులు మాత్రమే దానిని పవిత్రంగా దాస్తారు. జాతర సమయంలో పూజారులు చిలుకలగుట్టపైకి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి, తల్లిని కుంకుమ భరిణె రూపంలో గద్దెపైకి తెస్తారు. తల్లి గద్దెపైకి వచ్చేటప్పుడు జిల్లా కలెక్టర్, ఎస్పీ వంటి ఉన్నతాధికారులు సైతం గాలిలోకి కాల్పులు జరిపి ప్రభుత్వ లాంఛనాలతో స్వాగతం పలకడం ఇక్కడి ప్రత్యేకత.

సమ్మక్క గద్దెపై ఉన్న ఆ కుంకుమ భరిణెకు పూజలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. జాతర ముగిశాక, మళ్ళీ ఆ కుంకుమ భరిణెను పూజారులు అంతే రహస్యంగా భద్రపరుస్తారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola