India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
అఫ్గానిస్థాన్తో వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు క్లీన్ స్వీప్పై కన్నేసింది. చెన్నై వేదికగా జరగనున్న ఆఖరి వన్డేలో అఫ్గాన్ను 3-0తో వైట్వాష్ చేయాలని మనవాళ్లు పట్టుదలతో ఉంటే, కనీసం ఈ మ్యాచ్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని అఫ్గాన్ చూస్తోంది.
అయితే, వన్డే ప్రపంచకప్ 2027 సన్నాహకాల్లో భాగంగా ఈ మ్యాచ్లో టీమిండియా మేనేజ్మెంట్ భారీ ప్రయోగాలు చేయబోతోంది. బెంచ్ బలాన్ని పరీక్షించేందుకు వీలుగా తుది జట్టులో కీలక మార్పులు జరగనున్నాయి.
ముఖ్యంగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ గత మ్యాచ్లో వచ్చిన బంగారు అవకాశాన్ని వృధా చేసుకున్నాడు. మరి ఈ ఆఖరి వన్డేలో అతనికి ఇంకో ఛాన్స్ ఇస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జైస్వాల్ ఆడితే.. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతినిస్తారా? లేక రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్లలో ఒకరిని బెంచ్కు పరిమితం చేస్తారా అనేది చూడాలి. కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నట్లు వరల్డ్ కప్ కాంబినేషన్స్ కోసం చేసే ఈ ప్రయోగాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.