India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
శ్రీలంక పర్యటనలో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం భారత టెస్ట్ జట్టును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా ఆగస్ట్ 15 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో శుభ్మన్ గిల్ టీమిండియాను కెప్టెన్గా నడిపించనుండగా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
అయితే భారత జట్టులో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంగ్లాండ్ పర్యటనలో గాయపడి అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్కు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే అతను మ్యాచ్ ఆడటానికి ముందు ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేయాల్సి ఉంది. అటు రవీంద్ర జడేజా కూడా రీఎంట్రీ ఇవ్వడం జట్టుకు కొండంత బలాన్ని ఇస్తోంది.
అలాగే, ఆల్రౌండర్ సరాన్ష్ జైన్కు తొలిసారి టీమిండియా నుంచి పిలుపు దక్కింది. భారత్-ఏ తరఫున శ్రీలంక-ఏ తో జరిగిన సిరీస్లో అద్భుత ప్రదర్శన చేయడంతో సెలెక్టర్లు అతనికి అవకాశం ఇచ్చారు. మరోవైపు, సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ హర్ష్ దూబేను సెలెక్టర్లు పక్కనపెట్టారు. అఫ్గాన్తో మ్యాచ్లో అరంగేట్రంలోనే 7 వికెట్లతో సత్తా చాటిన మానవ్ సుతార్ను శ్రీలంక టూర్కు కొనసాగించడంతో హర్ష్ దూబేకు చోటు దక్కలేదు. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఈ సిరీస్కు సెలెక్ట్ కాలేదు.