Vijay Hazare trophy 2025 | విజయ్ హజారే ట్రోఫీలో తొలిరోజే రికార్డుల మోత మోగించిన బిహార్ బ్యాటర్లు

వరల్డ్ క్రికెట్లో ఎప్పుడూ ఏ టీమ్ కూడా వన్డేల్లో సాధించని.. కనీసం ఊహించని స్కోర్ కొట్టేసింది బిహార్ టీమ్. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఈ రోజు బుధవారం అరుణాచల్ ప్రదేశ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో బిహార్ బ్యాటర్లు రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. దీంతో వన్డే హిస్టరీలోనే తొలిసారి 574 పరుగుల భారీ స్కోరు నమోదైంది. 45 ఓవర్లలోనే 500 మార్క్ అందుకున్న బిహార్ టీమ్.. మొత్తం 50 ఓవర్లు పూర్తయ్యే టైంకి 6 వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసింది. ఇక బిహార్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లో సెంచరీ పూర్తి చేయడమే కాకుండా.. 84 బంతుల్లో 190 పరుగులు చేసి మరోసారి విధ్వంసం సృష్టించారు. ఇది వన్డేల్లో భారత్ తరపున రెండో అత్యధిక స్కోరుగా రికార్డయింది. అయితే ఈ రికార్డ్ నమోదైన కొద్ది సేపటికే బిహార్ కెప్టెన్ సకిబుల్ గని.. 32 బంతుల్లో సెంచరీ బాది లిస్ట్ ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన ఇండియన్ బ్యాటర్‌గా రికార్డ్ సృష్టించాడు. మొత్తంగా 40 బంతుల్లో 128 పరుగులతో చివరి వరకు నాటౌట్‌గా నిలిచిన గని.. అరుణాచల్ బౌలింగ్‌ని ఊచకోత కోశాడు. వీళ్లిద్దరితో పాటు కీపర్ ఆయుష్ లొహారుకా 56 బంతుల్లో 116 బౌండరీల మోత మోగిస్తే.. పీయూష్ సింగ్ 77 రన్స్‌తో హాఫ్ సెంచరీ బాదాడు. వీళ్లంతా కలిసి 49 ఫోర్లు, 38 సిక్స్‌లు బాదారు. ఇక బిహార్ బ్యాటర్ల దెబ్బకి అరుణాచల్ బౌలర్లందరూ దాదాపు సెంచరీ పరుగులు సమర్పించుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola