Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam

పేసర్ మొహమ్మద్ షమీకి ఎన్నికల కమిషన్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఓటర్ లిస్ట్‌కి సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) హియరింగ్‌కు హాజరుకావాలని షమీతో పాటు ఆయన సోదరుడు మహమ్మద్ కైఫ్‌కు నోటీసులిచ్చింది ఈసీ. సోమవారం దక్షిణ కొల్‌కతాలోని జాదవ్‌పూర్ ప్రాంతం కార్త్జు నగర్ స్కూల్ నుంచి షమీకి అధికారికంగా నోటీసులొచ్చాయి. మొహమ్మద్ షమీ స్వస్థలం ఉత్తరప్రదేశ్ అయినప్పటికీ.. క్రికెట్ కెరీర్ కారణంగా చాలా ఏళ్లుగా కోల్‌కతాలో నివసిస్తున్నాడు. ప్రస్తుతం కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ వార్డు నంబర్ 93లో ఓటరుగా ఉన్నాడు. ఈ వార్డు రాష్‌బిహారీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సమయంలో షమీ ఓవర్ ఐడీ పత్రాలలో మ్యాపింగ్ సమస్య ఎదురైంది. ఓ వ్యక్తి పేరు రెండు చోట్ల ఉన్నపుడు లేదా చిరునామాలో సాంకేతిక లోపాలు ఉన్నప్పుడు ఈ మ్యాపింగ్ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమస్య పరిష్కారం కోసమే సరైన రుజువులతో రావాలంటూ ఎన్నికల కమిషన్ షమీని ఆదేశించింది. అయితే తాను ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా రాజ్‌కోట్‌లో ఉండటం వల్ల విచారణకు హరాజరుకాలేనంటూ ఎన్నికల కమిషన్‌కు షమీ లేఖ రాశాడు. దీంతో షమీకి సంబంధించిన ఎస్ఐఆర్ హియరింగ్‌ని జనవరి 9 నుంచి 11 మధ్య నిర్వహించాలని ఈసీ నిర్ణయించినట్లు సమాచారం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola