Eng U19 vs India U19 Final | అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో 100 పరుగుల తేడాతో భారత్ విజయం | ABP Desam
అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్ ను భారత్ చిత్తు చేసింది. వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం చూపించిన ఈ మ్యాచ్ లో భారత్100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ విసిరిన 412 పరుగుల భారీ లక్ష్య చేధనలో నత్తనడకన ఛేజింగ్ ప్రారంభించింది ఇంగ్లండ్. మొదటి రెండు ఓవర్లు మేడిన్ చేసిన భారత బౌలర్లు..బౌలింగ్ లోనూ తగ్గేదేలేదని ప్రూవ్ చేశారు. అంబ్రీష్, దీపేష్ దేవేంద్రన్, కనిష్క చౌహాన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయటంతో ఇంగ్లండ్ పరుగులు చేయటం అంత తేలిగ్గా అనిపించ లేదు. ఓపెనర్ డాకిన్స్ 66 పరుగులు, బెన్ మేయ్స్ 45 పరుగులు చేసి ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం రాలేదు. కానీ మిడిల్ ఆర్డర్ ఫాల్కనర్ మాత్రం భారత్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుతంగా పోరాడి 67 బాల్స్ లోనే 9 ఫోర్లు 7 సిక్సర్లతో 115 పరుగులు చేసి చిట్టచివరి వికెట్ గా వెనుదిరిగాడు. ఫాల్కనర్ పోరాటంతో ఇంగ్లండ్ 311 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కొట్టిన 175 పరుగుల భారీ స్కోరుతో ఏకంగా 411 పరుగుల భారీ స్కోరును సాధించింది. మొత్తంగా ఈ విజయంతో భారత్ అండర్ 19 వరల్డ్ కప్ గెలవటంతో పాటు టోర్నీ హిస్టరీలో ఆరో వరల్డ్ కప్ ను ముద్దాడింది.