NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam
అంతరిక్ష పరిశోధనల్లో మరో చారిత్రాత్మక ఘట్టం మొదలైంది. 1972లో అపోలో 17 మిషన్ తర్వాత, అంటే దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత మళ్ళీ చంద్రుడి దెగ్గరకు మానవుడిని పంపేందుకు నాసా సిద్ధమైంది. ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఆర్టెమిస్-2 మిషన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.
గురువారం తెల్లవారుజామున 4:04 గంటలకు, 32 అంతస్తుల భారీ రాకెట్ నలుగురు astronauts లతో చంద్రుడి వైపు పయనమైంది. ఈ బృందంలో రీడ్ వైస్మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్ మరియు జెరెమీ హాన్సెన్ ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ astronauts తోపాటు ఎనిమిదేళ్ల చిన్నారి తయారు చేసిన ఒక బొమ్మ కూడా అంతరిక్షంలోకి వెళ్ళింది.
ఈ మిషన్ మొత్తం 10 రోజుల పాటు సాగుతుంది. మొదటి రెండు రోజులు astronauts భూమి చుట్టూ ఉన్న ఎత్తైన కక్ష్యలో ఉండి, ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ లోని సపోర్ట్ సిస్టం ను పరీక్షిస్తారు. ఆ తర్వాత చంద్రుడి వైపు ప్రయాణిస్తారు. ఏప్రిల్ 6వ తేదీ రాత్రికి ఈ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి ఉపరితలానికి కేవలం 7,600 కిలోమీటర్ల సమీపానికి చేరుకుంటుంది. ఈ సమయంలో astronauts చంద్రుడి అవతలి వైపు వెళ్ళినప్పుడు, సుమారు 30 నుండి 50 నిమిషాల పాటు భూమితో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఇది అత్యంత కీలకమైన సమయం. చంద్రుడి చుట్టూ తిరిగిన తర్వాత ఈ బృందం తిరుగు ప్రయాణం మొదలుపెడుతుంది. ఏప్రిల్ 11న తెల్లవారుజామున పసిఫిక్ మహాసముద్రంలో ఈ క్యాప్సూల్ దిగనుంది. భవిష్యత్తులో చంద్రునిపై మానవ నివాసానికి గల అవకాశాలను ఈ మిషన్ ద్వారా నాసా పరిశీలించనుంది.