Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..తన రాజకీయ పార్టీ జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని విన్నూత్నంగా నిర్వహించారు. తనకెంతో ఇష్టమైన ఉత్తరాంధ్రలో మన్యం గ్రామాలకు వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్ అక్కడే ప్రకృతి అందాల మధ్య..పల్లె ప్రజలతో మమేకవుతూ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాలను సందర్శించిన పవన్ కళ్యాణ్ ఓనూరు కూడలిలో జనసేన జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం అడవితల్లి బాట కార్యక్రమం ద్వారా అక్కడి మారమూల ఏజెన్సీ గ్రామాల్లో నిర్మించిన రోడ్లు, జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఏర్పాటు చేసిన తాగునీటి కుళాయిలు, గిరిజన గూడాల్లో ఉన్న స్కూళ్లను పరిశీలిస్తూ ముందుకు సాగారు. మన్యం గ్రామాలకు ఏళ్లుగా సమస్యగా ఉన్న రోడ్లు, మంచి నీటి కుళాయిలు రావటానికి సహకరించిన ప్రధాని మోదీకి, సీఎం చంద్రబాబు అక్కడి చిన్నారులతో కలిసి కృతజ్ఞతలు తెలిపిన పవన్ వాళ్లతో కలిసి ఫోటోలు దిగారు. బడులకు వెళ్లి అక్కడ చదువుకునే పిల్లలతో సరదాగా గడిపారు. వాళ్లకు స్కూలు బ్యాగులు అందించారు. అనంతంర మాటా మంతి సభ నిర్వహించి స్థానికుల గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా అడవి బిడ్డల ఆశీస్సుల మధ్య పవన్ తన రాజకీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకోవటం పలువురి ప్రశంసలను అందుకుంటోంది.