Attack on Nallapareddy Prasanna Kumar Reddy | మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై దాడి
కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసి వీరంగం సృష్టించారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా అంటూ దాడి చేశారు. ఈ దాడిలో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసమైంది. కారు, ఇంట్లో విలువైన వస్తువులు పగలగొట్టారు. ఈ సమయంలో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లో లేరని తెలుస్తుంది.
కోవూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పై, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో వేమిరెడ్డి అనుచరులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లోకి చొరబడి ఫర్నీచర్, కారు ధ్వంసం చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
వేమిరెడ్డి దంపతులపై మర్డర్ కేసు కట్టాల్సిందే అని మాజీ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. డబ్బుందన్న అహంకారంతో ప్రసన్నకుమార్ రెడ్డి అన్న ఇంటిపై దాడులు చేయించారు. ప్రసన్న కుమార్ రెడ్డి హత్యకు కుట్రలు జరుగుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. వేమిరెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.