Viral Video: రోజురోజుకూ పబ్లిక్ ప్లేసుల్లో అలజడులు పెరుగుతున్నాయి. కొందరు రీల్స్ చేస్తూ, మరికొందలు సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ రచ్చ చేస్తుండగా.. మరికొందరు దిగజారి ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ మెట్రోలో ఇలాంటి ఘటనలు తరచుగా ఎదురవుతున్నాయి. ఇటీవలే ఓ జంట మెట్రోలోనే రొమాన్స్ చేసిన వీడియో వైరల్ కాగా.. ఆ తర్వాత ఓ అమ్మాయి హెయిర్ స్ట్రెయిటనింగ్ చేస్తూ దర్శనం ఇచ్చింది. ఈ రెండు వీడియోలు గతంలో సోషల్ మీడియాను ఊపేశాయి. తాజాగా మరో వీడియో నెట్టింటిని షేక్ చేస్తోంది. అందేటీ అనుకుంటున్నారా.. ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువకుల ఫైట్ అండీ. 


అసలేం జరిగిందంటే..?


ఢిల్లీ మెట్రో గత కొన్ని నెలలుగా అనేక కారణాల వల్ల వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. బ్యాగ్‌లు ధరించిన ఇద్దరు యువకులు మెట్రో కోచ్‌లో.. దుమ్ము దుమ్ము కొట్టుకున్నారు. ప్రయాణికులంతా వీరి ఫైట్ కు దూరంగా ఉండగా.. కొందరు మాత్రం వారిని ఆపే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లు మాత్రం అస్సలే ఆగలేదు. ఒకరినొకరు విపరీతంగా అసభ్య పదజాలం వాడుతూ దూషించుకున్నారు. కొట్టుకున్నారు.


అక్కడే ఉన్న పలువురు వీరి గొడవను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. సచిన్ భరద్వాజ్ (Sachin Bharadwaj) అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా.. వేలల్లో వ్యూస్ వందల్లో కామెంట్లు వచ్చాయి. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఓ నెటిజెన్ స్పందిస్తూ.. "ఏదేమైనా ప్రశాంతంగా ఉండండి.. మీ జీవితంలో తక్కువ సమస్యలు ఉన్నాయా" అంటూ కామెంట్ చేశారు. అలాగే మరో వ్యక్తి అన్ని వయసుల వారికి ఆనందం ఢిల్లీమెట్రోసర్వీస్‌లో అందుబాటులో ఉందంటూ తెలిపారు. 






ఇలాంటి ఘటనలపై వెంటనే ఫిర్యాదు చేయాలి..!


ఈ క్రమంలోనే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఓ ప్రకటన విడుదల చేసింది.మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని కోరుతున్నట్లు వెల్లడించారు. ఇతర ప్రయాణికులు ఏదైనా అభ్యంతరకరమైన ప్రవర్తనను గమనించినట్లయితే.. వారు వెంటనే డీఎంఆర్సీ (DMRC) హెల్ప్‌ లైన్‌ కు ఫోన్ చేసి విషయం చెప్పాలని డీఎంఆర్సీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ దయాల్ అన్నారు. కోరారు. ఇటీవల డీఎంఆర్సీ ఫ్లయింగ్ స్క్వాడ్‌లను కూడా ఢిల్లీ మెట్రో సంస్థ నియమించింది. వీరు మెట్రోలో జరిగే ఇలాంటి ఘటనలను పర్యవేక్షిస్తుంటారు. అలాగే సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు కూడా తీసుకుంటారు. 


జానీ జానీ యెస్ పాపా.. ఓపెన్ యువర్ కామెరా నో నో నో..!


గతంలో ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ సంస్థ ట్విట్టర్ వేదికగా ఇటీవలే ఓ ప్రకటన చేసింది. అందులో మెట్రోలో రీల్స్ చేయరాదని వార్నింగ్ ఇస్తూ.. మార్గదర్శకాలను జారీ చేసింది. అందులో జానీ జానీ యెస్ పాపా.. మేకింగ్ రీల్స్ ఇన్ ది మెట్రో నో పాపా.. అని అడ్వైజరీలో పేర్కొంది. దీనికి ఓపెన్ యువర్ కామెరా.. నా నా నా అంటూ రాసుకొచ్చింది. ప్రయాణికులకు అసౌకర్యం కల్గించే ఇలాంటి కార్యకలాపాలను ఢిల్లీ మెట్రోలో నిషేధిస్తున్నామని వెల్లడించింది. డీఎంఆర్సీ చేసిన ఈ పోస్టుకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.