Viral Video of youth sleeping on Train Tracks for recording video to become famous

ఓవైపు జవాన్లు దేశం కోసం సరిహద్దుల్లో శత్రువులతో పోరాడుతూ తమ ప్రాణాలు త్యాగం చేస్తున్నారు. ఇటీవల పాక్ జరిపిన కాల్పుల్లో అమరులైన జవాన్లలో ఏపీకి చెందిన జవాను మురళీ నాయక్ ఉన్నాడు. ఆయన వయసు కనీసం పాతికేళ్లు కూడా లేవు. జీవితం అంటో ఏంటో కూడా చూడని మురళీ నాయక్ లాంటి వారు దేశ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు సరిహద్దుల్లో తమ ప్రాణాలొడ్డుతుంటే.. కొందరు యువత మాత్రం పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. 

ఫేమస్ కావడానికి రైలు పట్టాలపై పిచ్చి చేష్టలు

దేశం రక్షణ కోసం పోరాడి అమరుడైన వారికి ఎంతో గౌరవం, వారి త్యాగానికి గుర్తింపు ఉంటుంది. కానీ కొందరు యువత సోషల్ మీడియాలో ట్రెండ్ కావాలని.. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఫాలోయర్లు కావడానికి పిచ్చి పిచ్చి చేష్టలకు దిగుతున్నారు. ఓ యువకుడు ఫేమస్ కావడానికి రైలు పట్టాలపై పడుకున్నాడు. రైలు వెళ్లిపోయిన అనంతరం లేచి నిల్చుని, తాను ఏదో సాధించాను.. యుద్ధం గెలిచాననే తీరుగా అరుస్తున్నాడు. ఏం ఘనాకర్యం చేశాడని వాడు అరుస్తున్నాడు, ఎందుకు ఆ పట్టరాని సంతోషం. ఇంతకీ ఏం వెలగబెట్టాడని వాడి ముఖంలో నవ్వు అని ఆ వీడియో చూసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ యువకుడు ఫేమస్ కావడానికి చేసిన ప్రయత్నాన్ని తప్పుపట్టారు. రీల్స్ కోసం, లైక్స్, షేర్లు, వ్యూస్ కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టాలా అని ప్రశ్నిస్తూ యుువకుడు రైలు పట్టాలపై పడుకుని, రైలు వెళ్లిపోయాక లేచి అరుస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. జరగరాని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి.. ఏ ఘనకార్యం సాధించావని అరుస్తున్నావు, ఎందుకీ పట్టరాని సంతోషమని తన పోస్టు ద్వారా ఆయన ప్రశ్నించారు. ఇలాంటివి చేసినప్పుడు సరదాగా అనిపిస్తాయి, కానీ వాటివల్ల జరగరానిది జరిగితే ఆ నష్టం ఎవరికీ అని మందలించారు. 

బెట్టింగ్ యాప్స్ మీద పోరాడుతున్న సజ్జనార్

ఐపీఎస్ సజ్జనార్ ఇదివరకే చాలా వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి జాగ్రత్తలు చెప్పారు. బెట్టింగ్ యాప్స్ లాంటి వాటికి దూరంగా ఉండాలని  కొంతకాలం నుంచి హెచ్చరిస్తున్నారు. ఆయన కంటిన్యూగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో బాధ్యులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో వందల కేసులు నమోదైనా చర్యలు తీసుకున్నట్లు కనిపించలేదు. సెలబ్రిటీలు సైతం డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినా చర్యలు తీసుకోకపోవడంతో ఎంతో మంది యువత బెట్టింగ్ ద్వారా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇటీవల సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టడం, రెగ్యూలర్ గా ప్రభుత్వాలు మానిటరింగ్ చేయడంతో బెట్టింగ్ సమస్య కొంతమేర తగ్గినట్లు కనిపిస్తోంది.