Official Apology : పుష్ప సినిమాలో షెకావత్‌ సారూ, సారీ. అనేది అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు ఇలాంటిదే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రముఖ బ్రాండ్‌లు, సంస్థలు క్షమాపణలు(Apology) చెబుతూ గత వారం రోజులుగా సోషల్ మీడియాను నింపేస్తున్నారు. ఈ ట్రెండ్ నడుస్తున్న టైంలోనే తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు వీఐపీలు కూడా సారీ చెబుతూ మీడియాకు వీడియోలు, ప్రకటనలు విడుదల చేశారు. ఇందులో మంత్రి కొండ సురేఖ ఒకరు. సీనియర్ నటుడు ప్రకాష్‌రాజు, మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్‌ గతంలో తాము చేసిన తప్పులకు క్షమాపణలు కోరారు. 

Continues below advertisement

నేటి డిజిటల్ ప్రపంచంలో, మనం ప్రతిరోజూ ఒక కొత్త ట్రెండ్‌ను చూస్తాము. కొన్నిసార్లు ఇది ఒక డ్యాన్స్ ట్రెండ్, కొన్నిసార్లు ఒక మీమ్, కొన్నిసార్లు పాత పాట రీమిక్స్ వైరల్ అవుతూ ఉంటాయి. ప్రజలు వీడియోలు తయారు చేస్తారు. రీల్స్ పోస్ట్ చేస్తారు, వాటిని చూసి, నవ్వుతాం. ఇలా ట్రెండ్ అయిన వాటిలో కొన్ని విషాధ ఘటనలు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు, ఒక కొత్త ట్రెండ్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 

ఈసారి ట్రెండింగ్ టాపిక్‌లో డ్యాన్స్ లేదు, పాట లేదు, సరదా సవాలు లేదు; బదులుగా, ఈ ట్రెండ్‌ను #OfficialApology అంటారు. ఈ ట్రెండ్‌లో కంపెనీలు సోషల్ మీడియాలో తమ కస్టమర్లకు క్షమాపణలు చెబుతున్నాయి. కానీ ఇది తాము తప్పు చేస్తున్నందుకు కాదు, మార్కెటింగ్ ట్రిక్.

Continues below advertisement

అధికారిక క్షమాపణ ట్రెండ్ ఏమిటి?

నవంబర్ 5న, స్కోడా ఇండియా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో "అధికారిక క్షమాపణ", దాని క్రింద "టీమ్ స్కోడా ఇండియా" అనే పోస్ట్‌ను పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌ను చూసిన కొందరు కంపెనీ తీవ్రమైన తప్పు చేసిందని,  ఇప్పుడు క్షమాపణలు చెబుతోందని భావించారు. కానీ ప్రజలు దానిని జాగ్రత్తగా చదివినప్పుడు, అది నిజమైన క్షమాపణ కాదని, తెలివైన మార్కెటింగ్ వ్యూహమని అర్థమవుతుంది. ఆ పోస్ట్‌లో తమ కారు చాలా సౌకర్యవంతంగా ఉందని, డ్రైవర్‌కు దూర ప్రయాణాలు కూడా చిన్నవిగా అనిపించాయని పేర్కొన్నారు.

స్కోడా తర్వాత, సోషల్ మీడియా అధికారిక క్షమాపణలతో నిండిపోయింది. గార్నియర్, మ్యాన్‌ఫోర్స్, పివిఆర్ ఐనాక్స్, రిలయన్స్ డిజిటల్, క్యాషిఫై, క్లియర్, అన్ని బ్రాండ్‌లు తమ అధికారిక క్షమాపణ పోస్ట్‌లను పోస్ట్ చేశాయి. ప్రతి బ్రాండ్ దాని లక్షణాల్లో ఏదో ఒకదానికి క్షమాపణలు కోరింది. ఉదాహరణకు, గార్నియర్ ఇలా రాసింది, "దయచేసి మమ్మల్ని క్షమించండి ఎందుకంటే మా షాంపూ జుట్టును చాలా సిల్కీగా చేస్తుంది." మ్యాన్‌ఫోర్స్ ఇలా పేర్కొంది, "మేము చాలా వస్తువులను సురక్షితంగా ఉంచాము కాబట్టి మేము క్షమాపణలు కోరుతున్నాము." రిలయన్స్ డిజిటల్ కూడా ఇలా చెప్పింది, "మా ఆఫర్లు మీ బడ్జెట్‌కు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మేము క్షమాపణలు కోరుతున్నాము."

సోషల్ మీడియాలో ప్రజల స్పందన 

సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తే ప్రజల అసహనం అర్థమవుతోంది. మంచి పిఆర్ ట్రిక్ అని కామెంట్ చేస్తున్నారు. నిజమైన తప్పునకు కూడా క్షమాపణలు కోరుతారా అని రాసుకొచ్చారు. చివరకు ఒక కంపెనీ తన తప్పును అంగీకరించిందని మేము అనుకుంటున్నాము, కానీ ఇక్కడ అది స్వీయ ప్రమోషన్‌గా మారింది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.  #OfficialApology అనే హ్యాష్‌ట్యాగ్ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ట్రెండ్ కావడం ప్రారంభమైంది. ప్రజలు ఈ పోస్ట్‌ల స్క్రీన్‌షాట్‌లను షేర్ చేశారు, మీమ్‌లను సృష్టించారు. కొన్ని బ్రాండ్లు ఒకదానికొకటి కాపీ చేయడానికి పోటీని కూడా ప్రారంభించాయి. 

సారీ ట్రెండ్‌లో సారీ చెప్పిన వీఐపీలు

ఇప్పుడు మేము క్షమాపణలు కోరుతున్నాము అనే పదం ట్రెండ్ అవుతున్న టైంలో కొండా సురేఖ క్షమాపణలు కోరారు. నటుడు నాగార్జున ఫ్యామిలీపై తాను గతంలో చేసిన కామెంట్స్‌ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అలాంటి కామెంట్స్ చేసినందుకు ఆమె క్షమాపణలు చెప్పారు.

ఇది జరిగిన కాసేపటికి మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్‌ ఇద్దరు వ్యక్తులకు సారీ చెప్పారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణకిషోర్ విషయంలో చాలా తప్పులు చేశానని ఓ వీడియో విడుదల చేశారు. వాళ్లపై చర్యలు తీసుకునే విషయంలో నైతిక విలువలు పాటించకుండా వ్యవహరించినందుకు క్షమాపణలు కోరారు.

సాయంత్రానికి నటుడు ప్రకాష్ రాజు సారీ చెప్పారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు తనను క్షమించాలని వేడుకున్నాడు. ఇకపై ఇలాంటి తప్పులు చేయబోనని ప్రకటించారు. 

మొత్తానికి ఇలా వీఐపీలతోపాటు, వ్యాపార దిగ్గజాలు అపాలజీని చెప్పడం ట్రెండ్‌గా మారింది. అయితే ఇందులో ముగ్గురు చెప్పిన క్షమాపణల వెనుక వారి స్వప్రయోజనాలు ఉంటే కంపెనీలు చెప్పిన సారీకి కారణం వారి వ్యాపార ఆలోచన.