Rains in Telangana AP:  నైరుతీ రుతుపవనాల ముగింపు దశకు రావడంతో వీటి ప్రభావంతో చివరిసారి భారీగా వర్షాలు కురవనున్నాయి. నిన్న ఏపీ, తెలంగాణలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. అయితే సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు ఏపీ, తెలంగాణ, యానాంలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం, అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ నుంచి 4.5 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలో మోస్తరు వర్ష సూచనతో ఎల్లో జారీ చేసింది ఐఎండీ. 
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather)
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. తెలంగాణ నుంచి భారీ మేఘాలు వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలు నేరుగా ఏపీలోని ఎన్.టీ.ఆర్, పల్నాడు జిల్లాల్లోకి రాత్రి ప్రవేశించాయి. సెప్టెంబర్ 27 నుంచి ఆగస్టు 1 వరకు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురవనున్నాయి. వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. 





మరికొన్ని గంటల్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట, కొమురం భీమ్, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు సైతం హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. హైదరాబాద్ లో నేడు సైతం కొన్ని ప్రాంతాల్లో వర్ష సూచన ఉంది. అయితే 28, 29, 30 తేదీలు చాలా ముఖ్యమైనవి. ఈ మూడు రోజులు భారీ వర్షాలు పడేందుకు చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వర్షం పడకపోతే  మధ్యాహ్నానికి ఉక్కపోత సైతం అధికం కావడంతో నగరవాసులు ఇబ్బంది పడతారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఏపీలో మరో 5 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో, యానాంలోనూ ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. గాలులు వేగంగా వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లడం అంత క్షేమదాయకం కాదని హెచ్చరించారు.





దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
ఈ ప్రాంతాల్లో మరో నాలుగైదు రోజులపాటు మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్, అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేశాయి. రాయలసీమలోనూ భారీ వర్షాలున్నాయి. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, తిరుపతి జిల్లాలతో పాటు అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలున్నాయి. నీళ్లు నిలిచి ఉంటే చోట జాగ్రత్తగా ఉండాలని, నీటి ప్రవాహాన్ని దాటి వెళ్లే ప్రయత్నాలు చేయకూడదని ప్రజలను అధికారులు హెచ్చరించారు.