Rains in Telangana AP: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల నీటి ప్రవాహంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏపీతో పాటు తెలంగాణలో కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. పశ్చిమ మధ్య, దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వాయుగుండంగా మారింది. ఇది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాని తాకింది. మరో 24 గంటలల్లో విదర్బ మీదుగా మధ్యప్రదేశ్ ని తాకనుంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు యానాంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. 
తెలంగాణలో వర్షాలు 
తెలంగాణలో మరో రెండురోజుల వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్ష సూచనతో పలు జిల్లాలకు నేడు సైతం ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 
నిన్న ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లా,  హైదరాబాద్ లో మోస్తరు వర్షాలు కురిశాయి.
నేడు మరికొన్ని గంటల్లో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ కొన్నిచోట్ల వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.  





ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు మోస్తరు వర్షాలు పడతాయి. వైజాగ్ నగరంతో పాటుగా అనకాపల్లి, పెందుర్తి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కొనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ నగరం సివారు ప్రాంతాలు (గాజువాక​, పెందుర్తి వైపు), విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరిసీతారామరాజు జిల్లాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. తీరం వెంట గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. 
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
నేడు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. మోస్తరు నుంచి భారీ వర్ష సూచనతో ఎన్.టీ.ఆర్, ఏలూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.