Rains in Telangana AP: బంగాళాఖతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతాలపై అల్పపీడనం ప్రభావం చూపుతోంది. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో సోమవారం వర్షాలు కురిశాయి. నేడు సైతం పలు జిల్లాలకు వర్ష సూచనతో అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు ఎల్లో అలర్ట్ జారీ చేశాయి. ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ 15 ఏపీలోకి ప్రవేశించనున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టినా, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం శ్రీలంక ఉత్తర తీరానికి సమీపంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. 
 
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంపై అల్పపీడనం ప్రభావం మరో మూడు రోజుల వరకు ఉండనుంది. కొన్ని జిల్లాలకు వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అక్టోబర్ 15 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నిన్న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి.





నేడు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడితే, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. 


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
తమిళనాడు వైపు నుంచి వస్తున్న అల్పపీడనం ప్రభావం ఏపీలో మొదలైంది. ఈ రోజు కోస్తాంధ్రలో వర్షాలు జోరుగా కురవనున్నాయి. తెల్లవారుజాము నుంచి మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కొనసీమ, ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడతాయి. సాయంకాలం వరకు వర్షం పడుతుందని అంచనా వేశారు. విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం జిల్లాల్లో మధ్యాహ్న వరకు వర్షాలు కొనసాగి రాత్రికి తగ్గుముఖం పట్టనున్నాయి. తీరంలో 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో నైరుతి, తూర్పు బంగాళాఖాతం దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లడం క్షేమదాయకం కాదని అధికారులు హెచ్చరించారు.






దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అల్పపీడనం ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై తక్కువగా ఉంది. నేడు బాపట్ల​, ఉత్తర ప్రకాశం, కృష్ణా, ఎన్.టీ.ఆర్. జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరానికి పశ్చిమ భాగాల్లోని ప్రాంతాలు, తిరుపతి జిల్లా గూడూరు ప్రాంతంలో మోస్తరు వర్షాలు పడతాయి. రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడ మాత్రమే వర్షాలున్నాయి. కానీ అనంతపురం, కర్నూలు, సత్యసాయి జిల్లాలోని పశ్చిమ భాగాలలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.