Telangana Heavy Rains Alert June 19:  తెలంగాణ రాష్ట్రంలో ఎండల వేడితో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఒక చల్లని కబురు చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో మందకొడిగా సాగుతున్న నైరుతి రుతుపవనాల గమనం వేగవంతం కానుందని, మరో మూడు నాలుగు రోజుల్లో ఇవి తెలంగాణ అంతటా విస్తరిస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ముఖ్యంగా జూన్ 19వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారికంగా ప్రకటించింది.

Continues below advertisement

వాతావరణ శాఖ హెచ్చరికలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వర్షాల కారణంగా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తుగా నిరోధక చర్యలు చేపట్టాలని, విపత్తు నిర్వహణ యంత్రాంగాన్ని రాష్ట్ర స్థాయి నుంచి విలేజ్ లెవెల్ వరకు హై అలర్ట్‌లో ఉంచాలని అధికారులను ఆదేశించారు.  

రాబోయే రోజుల్లో కేవలం భారీ వర్షాలు మాత్రమే కాకుండా, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భారీ వర్షాల ప్రభావం ముఖ్యంగా ఉత్తర, తూర్పు మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉండే ముప్పు ఉందని వాతావరణ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ  కారణంగానే రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Continues below advertisement

నిజానికి జూన్ 8వ తేదీన జోగులాంబ గద్వాల జిల్లా ద్వారా నైరుతి రుతుపవనాలు దక్షిణ తెలంగాణలోకి ప్రవేశించాయి. జూన్ 14 నాటికి ఇవి హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం సహా మధ్య తెలంగాణ జిల్లాలకు విస్తరించాయి. జూన్ 1 నుండి ఇప్పటివరకు తెలంగాణలో సాధారణ వర్షపాతం 54.9 మిమీ నమోదు కావాల్సి ఉండగా, కేవలం 49.2 మిమీ మాత్రమే నమోదైంది. అంటే సుమారు 10 శాతం మేర వర్షపాత లోటు ఉంది. అయితే జూన్ 19 నుంచి కురిసే వానలతో ఈ లోటు భర్తీ కానుంది.

ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే ప్రమాదాన్ని అంచనా వేసి నిరోధక చర్యలు చేపట్టడం అత్యంత కీలకమని ప్రభుత్వం స్పష్టం చేసింది. నగరాలు, గ్రామాలలో నీరు నిలిచే లోతట్టు ప్రాంతాలను ముందే గుర్తించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజలు కూడా వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ, వర్షం పడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.