ఈ రోజు ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లాలోని  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం - దక్షిణ ఒడిశా తీరంలో ఉండి, సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిమి ఎత్తువరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉంది. ఈ ఆవర్తన ప్రభావం వల్ల నేడు వాయువ్య,  పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


మరొక ఆవర్తనం దక్షిణ ఛత్తీస్ ఘడ్ మీద కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుండి 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతూ ఉంది. షీయర్ జోన్ 20°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిమీ నుండి 7.6 కిమీ ఎత్తువరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉంది. 


ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తారు  వర్షాలు చాలా చోట్ల  కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.


రేపు, ఎల్లుండి భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది. మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ  కురిసే అవకాశం ఉంది.


భారీ వర్షాలు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ  కురిసే అవకాశం ఉంది


హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 26 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశ నుంచి గాలి వేగం గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 24.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.9 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 95 శాతంగా నమోదైంది.


ఏపీలో ఇలా
ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరం ఆనుకుని ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. 


నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
ఉత్తర, దక్షిణ కోస్తాల్లో  అలాగే మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీగా వానలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తులు నిర్వహణశాఖ హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో బుధవారం అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.