వరంగల్ : ఆ నియోజకవర్గంలో బీజేపీ టికెట్ కోసం ఆశావాహులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక కార్యకర్తల అభిమానాన్ని సంపాదించే ప్రయత్నాలలో కొందరు లీడర్లు ఉండగా రాష్ట్ర స్థాయి నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో మరికొందరు ఉన్నారు. ఇంతకీ ఉత్కంఠ నెలకొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో సీట్లు ఆశిస్తున్న లీడర్ల కసరత్తు మొదలైంది. 


ఎన్నికల కోసం బీజేపీ సన్నద్ధమా
రాష్ట్రంలో ఎలక్షన్ మూడ్ రావడంతో బీజేపీ నాయకులు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. తమ తమ నియోజకవర్గంలో బీజేపీ టికెట్ ఆశించే ఆశావాహుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికలలో బీజేపీ పార్టీ విజయకేతనం ఎగరవేయడంతో బీజేపీ నాయకులలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే బీజేపీకే మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. దీంతో ఎలాగైనా  టికెట్ సాధించాలని ఆశావాహులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు..


 టికెట్ నాకు అంటే నాకు అంటూ ప్రచారం
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుఫున పోటీ చేసేందుకు ఆశావాహుల పోటీ రోజురోజుకు పెరుగుతుంది. గత ఎన్నికల్లో బీజేపీ తరుపున వరంగల్ పశ్చిమలో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు ఇసారీ కూడా టికెట్ తనకే వస్తుందని ధీమాతో సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ టికెట్ దక్కించుకునేలా పావులు కదుపుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే హనుమకొండ జిల్లా అధ్యక్షురాలుగా కొనసాగుతున్న రావు పద్మ పలు ఆందోళన కార్యక్రమాలతో వరంగల్ పశ్చిమలో ప్రజల మన్ననలూ పోందే ప్రయత్నం చేస్తున్నారు. తనకు ఉన్న ప్రజాబలాన్నీ చూపిస్తూ రాష్ట్ర నాయకుల మెప్పు పోందేందుకు వ్యూహరచన చేస్తున్నారు. 
వరంగల్ పశ్చిమలో గెలిచే సత్తా తనకుందనీ బీజేపీ అధిష్టానానికి సంకేతాలు చేరవేసి, సీటు సాధించుకునేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు యువనేత, బీజేపీ అధికార ప్రతినిధిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా వరంగల్ పశ్చిమ నుంచి బీజేపీ తరపున పోటీచేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఎక్కువగా రాష్ట్ర స్థాయి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే రాకేష్ రెడ్డి గత కొన్ని రోజులుగా వరంగల్ పశ్చిమలోనే తిష్టవేసి కార్యకర్తలను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా యవతకు దగ్గరవుతూ నిత్యం వారితో సమావేశాలు నిర్వహించి, బీజేపీ సంబంధించిన కార్యక్రమలలో పాల్గోనేలా ప్రోత్సహిస్తూన్నారు. యవతలో, కార్యకర్తల్లో తనకు ఉన్నా బలాన్ని చూపిస్తూ టిక్కెట్ సాధించేందుకు తన స్టైల్లో రాజకీయం చేస్తున్నారు.


సర్వేల ఆధారంగా టికెట్ కేటాయింపు?
వరంగల్ ఉమ్మడి జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ టికెట్ కోసం నెలకొన్న పోటాపోటీ ఎక్కడ లేకపోవడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ధర్మారావు, రావు పద్మ, రాకేష్ రెడ్డి ఈ ముగ్గురు నేతలలో ఎవరికి వరంగల్ పశ్చిమ టికెట్ ఇవ్వాలనే చర్చలు రాష్ట్ర స్థాయి నాయకత్వంలో జరుగుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయానికి నియోజకవర్గంలో సర్వేలు నిర్వహించి ఏ నేతకు ప్రజాదరణ ఉంటుందో వారికే టికెట్లు దక్కే అవకాశాలు ఉన్నాయని బీజేపీ సీనియర్ నాయకులు చెబుతున్నారు.