KCR Nutrition Kit: కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ ఘనంగా ప్రారంభమైంది. సీఎం కేసీఆర్  నాయకత్వంలో భూపాలపల్లి జిల్లా అన్ని విధాల అభివృద్ధి చెందుతోందని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కూడా సీఎం కేసీఆర్ పథకాలను అభినందిస్తున్నారని తెలిపారు. మహిళలు రక్తహీనతతో బాధపడుతున్న ప్రాంతాలను ఎంపిక చేసి, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పథకాన్ని ప్రారంభించడం వల్ల గర్భిణీ స్త్రీలకు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 


ఆశా వర్కర్లకు రూ.1500 వేతనాన్ని రూ.9,750 చేశాం
రాష్ట్రస్థాయిలో నేడు 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పథకం ప్రారంభిస్తున్నామని..  జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పాల్గొని ఈ కిట్స్ ను గర్భిణీ స్త్రీలకు అందించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు బాగా కష్టపడుతున్నారు. సీఎం కేసీఆర్ వారిని బాగా అభినందిస్తున్నారు. కరోనా సమయంలో బాగా కష్ట పడ్డారు. అందుకే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన దగ్గర వారికి ఆ గౌరవం దక్కింది. గతంలో ఆశా వర్కర్లకు 1500 రూపాయల వేతనం ఉంటే సీఎం కేసీఆర్ దానిని 9750 రూపాయలకు పెంచారు. గుజరాత్ లో 4 వేల రూపాయలు ఉండగా, మధ్యప్రదేశ్లో 3 వేల రూపాయలు ఇస్తున్నారని గుర్తుచేశారు. అంగన్ వాడీల పరిస్థితి తెలంగాణ రాకముందు ఘోరంగా ఉండేదని, ఇప్పుడు వారికీ 13వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నాం అన్నారు.


భూపాలపల్లి జిల్లాలో గర్భిణీలు రక్త హీనతతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని గుర్తించి, ఈ జిల్లాను ఈ పథకం కింద సెలెక్ట్ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక, వైద్యశాఖల మంత్రి హరీష్ రావు  ఈ జిల్లాకు వచ్చినపుడు డాక్టర్ పోస్టులు కావాలని అడిగితే వెంటనే 23 డాక్టర్ పోస్టులు మంజూరు చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఇపుడు అడిగినవి కూడా పరిష్కారం అవుతాయన్నారు. గతంలో భూపాలపల్లి జిల్లాలో ఎలాంటి వసతులు లేవు. కేసీఆర్ వచ్చాక జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. బిల్డింగులు కట్టుకున్నాం. భూపాలపల్లి జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరైంది. 100 పడకల ఏరియా ఆస్పత్రి ప్రారంభంతో పాటు 50 పడకల ఆయుష్ ఏర్పాటు చేసుకున్నాం. భూపాలపల్లిలో ప్రత్యేకంగా అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు.


ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం పెరుగుతుంది
మొన్న ఆర్మూర్ జడ్జి  కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీ అయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజల్లో బాగా నమ్మకం పెరుగుతోందన్నారు. గర్భిణికి నొప్పులు వస్తే ముందుగా ప్రభుత్వానికి  ఫోన్ చేస్తున్నారు. ఫోన్ రాగానే అమ్మ ఒడి వాహనం వచ్చి తీసుకెళ్ళి డెలివరీ చేయిస్తున్నారు. భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 2079 డెలివరీలు జరిగితే..అందులో నార్మల్ డెలివరీ వెయ్యి మంది. ప్రైవేట్ హాస్పిటల్లో 1250 మంది డెలివరీ అయితే 178 నార్మల్ కాగా మిగిలినవన్నీ ఆపరేషన్లు జరిగాయి. ఆపరేషన్ జరిగిన తర్వాత తల్లి చిన్నపని కూడా చేయలేదు. తల్లి పాలు ఇవ్వకపోవడం వల్ల పిల్ల కూడా సరిగా ఎడగదు. తల్లి పాలు తాగితేనే పిల్ల ఎదుగుదల బాగా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప... నొప్పులకు ఇబ్బంది పడి, తొందరపడి ఆపరేషన్ చేసుకోవద్దు అని సూచించారు. 


ఎర్రబెల్లి ఇంకా ఏమన్నారంటే..
కేసిఆర్ న్యూట్రిషన్ కిట్స్ జాగ్రత్తగా వాడండి ఆరోగ్యంగా ఉంటారు. గర్భిణీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, భూపాలపల్లి లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ ప్రారంభించడం హర్షించదగ్గ విషయం. ఈ కిట్లోని ఆహార పదార్థాలను ఇంట్లో అందరికీ పెట్టకుండా గర్భిణీలు తినాలి. భూపాలపల్లి జిల్లాలో గతంలోనే 20 కోట్ల రూపాయలు ఇచ్చాను. ఇంకా డ్యామేజ్ ఉంటే మరో 10 కోట్ల రూపాయలు ఇస్తాను. 67 కొత్త గ్రామ పంచాయతీలు మంజూరు ఇచ్చాం. సీసీ రోడ్లు, కొత్త రోడ్లు ఇస్తాం. ప్రత్యేక శ్రద్ద తీసుకుంటాం. భూపాల పల్లి జిల్లా బాగా అభివృద్ధి అవుతుంది. ఇది అన్ని రంగాల్లో ముందు ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి హర్షిని, కలెక్టర్ భవేష్ మిశ్రా, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, నేతలు, మహిళలు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.