Siddipeta News: సిద్దిపేట ప్రజల కష్టాలు తీర్చేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఈక్రమంలోనే సిద్దిపేటలో కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్ నుంచి రైళ్లను నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గంటన్నరలోనే సిద్దిపేట నుంచి హైదరాబాద్ చేరుకునేలా చేస్తున్నారు. కాచిగూడ, సికింద్రాబాద్ సహా పలు రైల్వే స్టేషన్ల నుంచి సిద్దిపేటకు రైళ్లు నడిపించాలని రైల్వే అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం అవసరమైన ప్రణాళికలను కూడా రూపొందిస్తున్నారు. గత నెలలో కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఆధ్వర్యంలో ప్యాసింజర్ రైళ్లు నడిపేందుకు రైల్వే రూట్ సర్వే కూడా పూర్తి చేసినట్లు అధికారులు వివరిస్తున్నారు. అయితే ఇక్కడి స్టేషన్ మీదుగా ప్యాసింజర్ రైళ్లు నడపాలని కోరుతూ.. మంత్రి హరీష్ రావు రైల్వే అధికారులకు మూడు ప్రతిపాదనలతో వినతిపత్రం కూడా అందజేశారు. 


సిద్దిపేట ప్రజలు ఎక్కువగా హైదరాబాద్ కు వెళ్తుంటారు. ఉద్యోగాలు, ఇతర పనుల నిమిత్తం నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు మార్గం ద్వారా అంటే బ్ససుల్లో వెళ్తే కనీసం మూడు గంటల సమయం పడుతుంది. అదే రైలులో ప్రయాణిస్తే గంటన్నరలోనే భాగ్యనగరానికి చేరుకోవచ్చు. దీనికి తోడు రైల్వే పాస్ కూడా అందుబాటిలోకి తీసుకొస్తే.. రూ.350తోనే నెలంతా సిద్దిపేట - హైదరాబాద్ ల మధ్య రాకపోకలు సాగించవచ్చు. సిద్దిపేటకు రైలు మార్గం వల్ల సమయంతోపాటు డబ్బు కూడా ఆదా అవుతుంది.


అయితే సిద్దిపేట రైల్వే స్టేషన్ నుంచి మూడు రైళ్ల రాకపోకలకు ఆమోదం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాచిగూడ నుంచి బెంగళూరు మీదుగా మైసూర్ వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలును సిద్దిపే నుంచి ప్రారంభించాలని యోచిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే పద్మావతి, నారయణాద్రి, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఒకదానిని ఇక్కడి నుంచి నడిపించే యోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు సిద్దిపేట - కాచిగూడ మధ్య పుష్పుల్ రైలను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారట. 


800 మీటర్ల పొడవుతో గూడ్సు షెడ్డు ఏర్పాటు


సిద్దిపేట రైల్వే స్టేషన్ భవనం నిర్మాణం చాలా వేగంగా పూర్తి అయింది. దీంతో పాటు సరుకు రవాణాకు భారీ గూడ్సు యార్డును నిర్మించారు. ఇక్కడ మొత్తం ఐదు లైన్లు ఏర్పాటు చేశారు. ఒకటి మెయిన్ లైన్, రెండు లూప్ లైన్లు, ఒకటి గూడ్సు లైను, ట్రాక్ మెయింటెనెన్స్ కు వినియోగించే ట్రాక్ మిషన్ కోసం సైడింగ్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ప్లాట్ ఫామ్స్ 750 మీర్ల పొడవుతో ఏర్పాటు చేశారు.ఈ ప్రాంతం నుంచి సరుకు రవాణా భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్న రైల్వే శాఖ, అందుకోసం దాదాపు 800 మీటర్ల పొడవుతో గూడ్సు షెడ్డును ఏర్పాటు చేసింది. ఇప్పటికే గజ్వేల్ లో 600 మీటర్ల పొడవుతో ఏర్పాటు చేసిన సరుకు రవాణా యార్డు బాగా ఉపయోగ పడుతుంది. ఈ ప్రాంతానికి కావాల్సిన ఎరువులు రైలు ద్వారానే వస్తున్నాయి. ఈ ప్రాంతం నుంచి ధాన్యం క్రమం తప్పకుండా ఎగుమతి అవుతోంది. సిద్దిపేటలో కూడా సరుకు రవాణా ప్రాంగణం అందుబాటులోకి వస్తే ధాన్యం తరలించేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.