Warangal News : వరంగల్ ఎంజీఎం మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఒకరి మృతదేహం బదులు వేరే మృతదేహాన్ని ఇచ్చారు పోస్ట్ మార్టం సిబ్బంది. కొద్ది దూరం వెళ్లాక గుర్తించిన బంధువులు మళ్లీ ఎంజీఎంకి వచ్చి తన బంధువు మృతదేహం తీసుకెళ్లారు. వరంగల్ నగరంలోని కాకతీయ వైద్య కళాశాలకు సంబంధించిన మార్చరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్టేషన్ ఘనపూర్ మండలం తానేదార్ పల్లకి చెందిన రాగుల రమేష్ భార్యతో గొడవపడి నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పరమేశ్వర్ గాయంతో ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. ఇవాళ వారిని పోస్టుమార్టం చేసిన సిబ్బంది పరమేశ్వర్ మృతదేహానికి బదులు రమేష్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కొద్ది దూరం వెళ్లాక మృతదేహాన్ని చూడడంతో తమకు సంబంధించిన మృతదేహం కాదని తిరిగి ఎంజీఎం మార్చడానికి వచ్చి పరమేశ్వర్ మృతదేహాన్ని తీసుకెళ్లారు. దీంతో కొద్దిసేపు రమేష్ బంధువులు ఎంజీఎం వద్ద ఆందోళన చేశారు. ఇక పోస్టుమార్టం సిబ్బంది తమకు సంబంధం లేదన్నారు. మద్యం మత్తులో బంధువులే ఒకరి మృతదేహానికి బదులు ఇంకో మృతదేహాన్ని తీసుకెళ్లారని మళ్లీ తమది కాదని తీసుకొచ్చారని మార్చురీ సిబ్బంది సమాధానం చెబుతున్నారు.  


మార్చురీలో నయా దందా 


వరంగల్‌ లోని మహాత్మాగాంధీ మెమోరియల్‌ ఆస్పత్రిలోని మార్చురీలో ఇటీవల ఓ దందా వెలుగుచూసింది. పేషెంట్స్, వారి బంధువుల కన్నీరు ఆస్పత్రిలోని కొందరు సిబ్బందికి ఆదాయ వనరవుతోంది. కాసులు చేతికిరానిదే పోస్ట్ మార్టం చేయలేని పరిస్థితులు ఉన్నాయని గతంలో పలుమార్లు విమర్శలు వచ్చాయి. మృతదేహాలను బయటకు తీసుకురావడానికీ సమర్పించాల్సి వస్తోంది. రాష్ట్ర అసెంబ్లీలో దీనిపై నాలుగేళ్ల కిందట చర్చ జరిగింది. ఓ డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించడానికి రూ.5 వేలు డిమాండ్ చేసిన వీడియో ఇటీవల వైరల్ కావడంతో అప్పట్లో రాష్ట్ర స్థాయి అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు స్పందించారు. అంతా తెలిసినా అధికారులు మిన్నకుండిపోవడం విమర్శలకు తావిస్తోంది. వైద్య సేవలందించాల్సిన వారే దళారులుగా మారడంతో పేషెంట్ల కుటుంబాలు ఎవరికి చెప్పాలో తెలియని అయోమయంలో ఉన్నారు.


వరంగల్ ఎంజీఎం మార్చరీలో ప్రతిరోజూ ఐదు నుంచి పది వరకు శవాలకు పోస్టుమార్టం నిర్వహిస్తుంటారు. అయితే పోస్టుమార్టానికి వెళ్తున్న శవాలపై డబ్బులు డిమాండ్ చేస్తూ మరోసారి దందాకు తెరలేపారు సిబ్బంది. ఈ ఏడాది జనవరిలో పస్తం శ్రీను అనే వ్యక్తి వరంగల్ - కాజీపేట మధ్య వందేబారత్ ట్రైన్ ఢీ కొని మృతి చెందాడు. పోస్ట్ మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చరీకి తరలించారు జీఆర్పీ పోలీసులు. అసలు సమస్య అక్కడే మొదలైంది. ఐదు రోజుల పాటు డెడ్ బాడీ ఎంజీఎం మార్చరీలోనే ఉంది. అయితే రూ.15000 డిమాండ్ చేసినట్లు బాధితులు ఆరోపించారు. వరంగల్ ఎంజీఎం మార్చరీలో సిబ్బందితో పాటు పంచానామా రాసే కానిస్టేబుల్ సైతం డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహించే డాక్టర్ కు రూ.3500, ఫోటోగ్రాఫర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ కోసం రూ. 3500, పోలీస్ కానిస్టేబుల్‌కు రూ. 3500, అంబులెన్స్ పేరుతో రూ.3500 వరకు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఘటన ఏబీపీ దేశం కథనాలు ప్రసారం చేసింది.