టీఆర్‌ఎస్‌ ఇక బీఆర్‌ఎస్‌.. ఆమోదం తెలిపిన ఎన్నికల సంఘం..నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం..


బీఆర్‌ఎస్‌కి సీఈసీ లైన్ క్లియర్ చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్పునకు ఆమోదం తెలిపింది. భారత్ రాష్ట్ర సమితిగా ఆమోదిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు అధికారికంగా సీఈసీ లేఖ రాసింది. నేడు మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ కార్యక్రమం జరగనుంది. బీఆర్‌ఎస్‌ అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. నేడు మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు సీఈసీ లేఖకు కేసీఆర్ రిప్లై ఇవ్వనున్నారు. సీఈసీ రిప్లై లేఖపై మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు కేసీఆర్ సంతకం చేయనున్నారు. ఆ తర్వాత సీఎం కేసిఆర్ బిఆర్ఎస్ జండాను ఆవిష్కరిస్తారు. పతావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరుకావాలని ముఖ్యమంత్రి కోరారు.  వీరితోపాటు.. జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవనకు చేరుకోవాలని పార్టీ అధినేత సీఎం కేసిఆర్ ఆదేశించారు.


సిట్‌ రివిజన్‌ పిటిషన్‌ పై హైకోర్టులో విచారణ .నేడు తీర్పు


సిట్‌ రివిజన్‌ పిటిషన్‌ పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతిపాదిత నిందితుల తరుపు లాయర్‌ రవిచందర్‌ వాదించారు. ఎఫ్‌ ఐఆర్‌ లో ప్రతిపాదిత నిందితుల పేర్లు చేర్చడం చట్టవిరుద్దమన్నారు. రిమాండ్‌ రిపోర్టులో గానీ, ఎఫ్‌ ఐఆర్‌ లో గానీ పేర్లు లేకుండా ఎ4, ఎ7 పేర్లు మొమో జత చేశారన్నారు. ఫామ్‌ హౌజ్‌ కేసులో ఫిర్యాదుదారుపైనే 80కేసులున్నాయన్నారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కాగా, కోర్టు నేడు తీర్పును వెలువరించనుంది.


నేడు ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రోకు శంకుస్థాపన.. 


హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్ట్‌కు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మైండ్ స్పేస్ జంక్షన్‌లోని రాయదుర్గం మెట్రో టెర్మినల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకూ విస్తరించబోయే మెట్రో కారిడార్‌కు నేడు సీఎం కేసీఆర్ భూమి పూజ చేయబోతున్నారు. మైండ్ స్పేస్ దగ్గర ఉదయం 10 గంటలకు శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్. శంకుస్థాపన తర్వాత అప్పా పోలీసు అకాడమీ దగ్గర సభలో ప్రసంగించనున్న కేసీఆర్. బయోడైవర్సిటీ జంక్షన్, కాజాగూడ రోడ్డు మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర నానక్ రామ్‌గూడ జంక్షన్‌ను తాకుతుంది. బయోడైవర్సిటీ దగ్గర ప్రస్తుతమున్న రెండు ఫ్లైఓవర్ల పైన మెట్రో లైన్ అలైన్మెంట్ వస్తుందన్నారు ఎన్వీఎస్ రెడ్డి. రూ. 6,250 కోట్లతో మొత్తం 31 కిలోమీటర్ల పొడవున ఈ మెట్రో ప్రాజెక్టును నిర్మించనుంది. ఈ మార్గంలో పలు ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.


ఈ ఫేస్-2కి సంబంధించి రెండు డీపీఆర్‌లను కేంద్రానికి పంపించామన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. డీపీఆర్‌ను బయటకు ఇస్తే పలు కారణాలతో కేసులు అయ్యి.. పనులు జరగడం లేదన్నారు. అందుకే డీపీఅర్‌ను బయటికి ఇవ్వకుండా కేంద్రానికి పంపామన్నారు.


ఇలాంటి కేసులతోనే సిటీ మెట్రో 6 నెలలు ఆగిపోయిందన్నారు. ఎయిర్ పోర్ట్ మెట్రోకి అలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటామన్నారు. ప్రస్తుతం సిటీలో 80 కిలోమీటర్ల మాక్సిమం స్పీడు ఉంటే ఎయిర్ పోర్ట్ మెట్రో 120 కిలోమీటర్ల హై స్పీడ్‌తో వెళ్లేలా ప్లాన్ చేస్తున్నామన్నారు.


నేడు సోనియా గాంధీ పుట్టినరోజు - వేడుకలు నిర్వహించనున్న టీపీసీసీ


ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ జన్మదినోత్సవం సందర్భంగా బోయినిపల్లి లోని గాంధీ ఐడియాలజి కేంద్రంలో జన్మదిన వేడుకలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో రక్త దాన శిబిరం, ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగనున్న రక్తదాన శిబిరం కొనసాగుతుంది. రాజీవ్ గాంధీ ప్రమాద భీమా చెక్ ల పంపిణీ తదితర కార్యక్రమాలు జరుగుతాయి. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తో పాటు సీనియర్ నాయకులు పాల్గొంటారు.


నేడు వరంగల్ కాజీపేట లో ధూం ధాం


దీక్షా దివస్‌ ముగింపు సందర్భంగా నేడు ఉదయం 10గంటలకు కాజీపేట చౌరస్తాలో ధూంధాం నిర్వహిస్తున్నట్లు ‘కుడా’ మాజీ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి తెలిపారు. దీక్షా దివస్‌ స్ఫూర్తితో తెలంగాణ సాధించి, రాష్ట్రం అభివృద్ధిదిశలో దూసుకుపోతోందన్నారు. దీక్షా దివస్‌ సందర్భంగా 11రోజులుగా పలు కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ముగింపు సందర్భంగా అన్ని డివిజన్లలో జెండా ఆవిష్కరణ,నేడు కాజీపేట చౌరస్తాలో ధూం.. ధాం.. నిర్వహిస్తారు.


నేడు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం.. వరంగల్ లో వినూత్న కార్యక్రమాలు


డిసెంబర్-9 అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా .. జ్వాలా అవినీతి వ్యతిరేక సంస్థ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అవినీతికి దూరంగా ఉంటూ అత్యంత నిజాయితీగా వ్యవహరిస్తున్న ఇద్దరు ప్రభుత్వ ఉన్నతాధికారులను నేడు సన్మానించడంతోపాటు అశ్వంపై ఊరేగించనున్నారూ. ఈ కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు హనుమకొండ వెయ్యి స్తంభాల గుడి వద్ద ప్రారంభమై అంబేద్కర్ విగ్రహం వరకు సాగనుంది. జ్వాలా, లోక్ సత్తా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి లోక్ సత్తా సంస్థ రాష్ట్ర సలహాదారులు ప్రొఫెసర్ పరచా కోదండ రామారావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.