Bandi Sanjay:  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ‘ఫోర్త్ సిటీ’ వెనుక పెద్ద ఎత్తున భూదందా జరుగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దందా చేస్తూ వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ధరణి పేరుతో దాదాపు రూ.2 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ధరణి స్కాం (Dharani Web Poratal) దేశంలోనే అతిపెద్దదని ఆయన పేరొన్నారు. కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ బాటలో నడుస్తూ వేల కోట్ల ఆస్తులను దోచుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని గుర్రంగూడలో ఆదివారం నిర్వహించిన బోనాల ఉత్సవాలకు బండి సంజయ్ పాల్గొన్నారు. 


బోనాల పండుగకు సైంటిఫిక్ రీజన్ ఉంది
ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములకు బోనాల పండుగ శుభాకాంక్షలు, బోనాల పండుగ వెనుక పెద్ద చరిత్ర ఉంది. బోనాల పండుగకు సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. కానీ ఇంత పెద్ద పండుగకు ప్రభుత్వం నిధులివ్వదు. హిందువుల పండుగలకు పైసలివ్వరు. సెక్యులరిజం పేరుతో ఒక మతానికే కొమ్ముకాస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. రంజాన్ కు రూ.33 కోట్లు, హిందువులను చంపిన తబ్లిగీ జమాతే సంస్థకు 2 కోట్ల 40 లక్షలు విడుదల చేసిన కాంగ్రెస్ అదేదో ఘన కార్యంగా చెప్పుకోవడం సిగ్గు చేటు.


హిందువుల పండుగలంటే అంత చులకనా? బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ కూడా ఎంఐఎం పార్టీకి కొమ్ము కాస్తోంది. ఈ విషయంపై మాట్లాడితే నాపై మతతత్వ ముద్ర వేయాలని చూస్తున్నారు. ఇట్లనే వ్యవహరిస్తే బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పట్టడం ఖాయం. ఎంఐఎం పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ నేతలు నట్టేట మునగడం ఖాయం. 15 నిమిషాలపాటు సమయమిస్తే హిందువులను నరికి చంపుతానన్న అక్బరుద్దీన్ ఒవైసీని తీసుకెళ్లి కొడంగల్‎లో పోటీ చేయిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించడం సిగ్గు చేటు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు ఆలోచించాలి. నిరంతరం బీజేపీని విమర్శించడం మానుకోవాలి. తెలంగాణ అభివ్రుద్దికి మేం పూర్తిగా సహకరిస్తాం. కలిసికట్టుగా పనిచేసి నిధులు తీసుకొద్దాం. అంతే తప్ప ప్రధానమంత్రిని అదే పనిగా తిట్టడంవల్ల నష్టమే తప్ప లాభం లేదనే అంశాన్ని గుర్తుంచుకోవాలి’’ అన్నారు.


రియల్ ఎస్టేట్ దందా
మహేశ్వరం ను ఫోర్త్ సిటీగా మారుస్తామన్న కాంగ్రెస్ సర్కార్ ప్రకటన వెనుక పెద్ద భూదందా నడుస్తోందని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను అగ్గువకు కొని ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నరు. బీఆర్ఎస్ మాదిరిగానే భూదందాతో వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు ఫోర్త్ సిటీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీనివల్ల కాంగ్రెస్ నేతలకు తప్ప ప్రజలకు పెద్దగా ప్రయోజనం లేదు పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించేందుకు భూ దందాను తెరపైకి తేవడమే కాకుండా  మహేశ్వరం కాంగ్రెస్ స్థానిక కాంగ్రెస్ నాయకుడికే భూములను సేకరించే బాధ్యతను అప్పగించారు. 


రుణమాఫీ మాయ
ఎన్నికల సమయంలో చెప్పిన రుణమాఫీ హామీ నెరవేర్చలేదు. ఇప్పటి వరకు 18 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు. లక్ష లోపు రుణం తీసుకున్న రైతుల సంఖ్య గత ప్రభుత్వ హయాంలోనే 36 లక్షల మంది ఉంటే లక్షన్నర లోపు రుణమాఫీ లబ్దిదారుల సంఖ్య 18 లక్షలు దాటకపోవడం గమనార్హం. అంటే నూటికి 70 మంది రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ కాలే.. ఒకవైపు బ్యాంకుల్లో వడ్డీలు పెరిగి, బయట చేసిన అప్పులు తీరక, పెట్టుబడికి పైసల్లేక రైతులు అల్లాడుతుంటే ఈ ప్రభుత్వం మాత్రం గొప్పలు చెబుతోంది. రుణమాఫీతోపాటు 6 గ్యారంటీలను అమలు చేయకుండా దాటవేసేందుకు కాంగ్రెస్ నేతలకు ఏదో ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావడం, ప్రజల ద్రుష్టిని మళ్లించడం అలవాటైపోయింది. రాబోయే స్థానిక సంస్థల్లో గెలిచేందుకు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతోందే తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదు.  రుణమాఫీ సహా ఆరు గ్యారంటీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులుసహా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని బీజేపీ పోరుబాటకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కార్యచరణ రడీ అవుతోంది. 


ధరణి పేరు భూమాతగా మార్పు 
ధరణి పేరును భూమాతగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం....భూమాతను భూమేతకు ఉపయోగించుకునేందుకు రెడీ అవుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ధరణి పేరుతో దేశంలోనే అతిపెద్ద స్కాం జరిగింది.  తెలంగాణ ఏర్పడిన 2014 నాటికి రాష్ట్రంలో 24 ల‌క్షల అసైన్డు భూములుంటే నేడు ఆ భూములు ఐదు ల‌క్షలకు ఎలా త‌గ్గాయి. అసైన్డు భూముల‌ను, శిఖం భూములను, దేవాదయ, అటవీ, భూదాన భూములతోపాటు పేదల భూములను కూడా  ధరణి పేరుతో  బీఆర్ఎస్ లీడ‌ర్లు దండుకున్నరు. రిజిస్ట్రేష‌న్లు చేయించుకున్న వివ‌రాలెక్కడ ? వాటిని ఎందుక‌ని రేవంత్ స‌ర్కారు బ‌య‌ట పెట్టడం లేదని ఆరోపించారు.  ఆ భూముల విలువ రెండు ల‌క్షల కోట్ల రూపాయల వ‌ర‌కు ఉంటుంది. కేసిఆర్ కుటుంబ సభ్యులు పెద్ధ ఎత్తున ధరణిని అడ్డుపెట్టుకుని దోచుకున్నారని ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే ధరణిపై ఐదుగురు స‌భ్యుల‌తో వేసిన క‌మిటీ నివేదిక ఎటుపోయిందన్నారు. ఫోర్త్ సిటీ, భూమాత పేరుతో భూములను దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల తీరు చూస్తుంటే భవిష్యత్తులో గజం భూమి కూడా మిగిలే పరిస్థితి కన్పించడం లేదు.  


అర్థం లేని ప్రతిపాదన
గ్రేటర్ హైదరాబాద్ శివారులోని 33 గ్రామపంచాయతీలు, 20 పురపాలక సంఘాలు, 8 కార్పొరేషన్లు, 61 పారిశ్రామిక వాడలు, కంటోన్మెంట్ బోర్డు.. వీటన్నింటినీ గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేయాలనే ప్రతిపాదన అర్ధం లేనిది. ప్రజలపై పన్నుల భారం మోపేందుకే విలీన కుట్ర చేస్తున్నారు. 15 ఏళ్ల కిందట హైదరాబాద్ శివారులోని విలీనమైన ప్రాంతాలు ఇప్పటికీ అభివ్రుద్ధికి నోచుకోలేదు. వాటిని అభివృద్ధి చేయకుండా, కనీస సౌకర్యాలు కల్పించకుండా  ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలను విలీనం చేస్తామనడం అర్ధం లేనిది. దీనిపై బీజేపీ నాయకత్వం చర్చించి తగిన కార్యాచరణను ప్రకటిస్తుంది.