TSPSC Leak Case :  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల పేపర్ లీకేజీ కేసులో సిట్ పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరు  డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పేపర్‌ ను ప్రధాన నిందితుడయిన శ్రావణ్ వద్ద కొనుగోలు చేశారు. అరెస్టయిన వారిని సాయి లౌకిక్, సుష్మగా గుర్తించారు. వీరిద్దరూ ప్రేమికులు. సుష్మ కోసం సాయి లౌకిక్ ఆరు లక్షల రూపాయలు శ్రావణ్‌కు చెల్లించి మరీ ప్రశ్నాపత్నాన్ని కొనుగోలు చేశారు. శ్రావణ్‌కు బ్యాంక్ ఖాతా ద్వారా నగదు చెల్లించారు. సిట్ పరిశోధనలో శ్రావణ్  బ్యాంకు ఖాతాలను పరిశీలించడంతో ఇలా పెద్ద మొత్తంలో నగదు జమ అయిన విషయాన్ని గుర్తించారు. ఎవరు జమ చేశారో ఆరా తీసి వారిని ప్రశ్నించడంతో అసలు గుట్టు బయట పడింది. పేపర్ కొనుగోలు చేసినందున వీరిద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు.  ఇప్పటి వరకూ  TSPSC పేపర్‌ లీక్‌ కేసులో  అరెస్ట్ అయిన వారి సంఖ్య 17కు చేరింది. 



 టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌పై టెక్నికల్ సాక్ష్యాల కోసం సిట్ అధికారులు ఇప్పటికే ఎఫ్ఎస్‌ఎల్ విశ్లేషణ చేయించారు. ఆ నివేదిక కూడా పోలీసులకు అందింది.  ప్రవీణ్, రాజశేఖర్, రేణుక నుంచి సీజ్ చేసిన సెల్‌ఫోన్లను ఎఫ్‌ఎస్‌ఎల్‌ తో విశ్లేషణ చేయించారు.  టీఎస్‌పీఎస్సీ ఆఫీసులోని ప్రవీణ్, రాజశేఖర్ లాప్టాప్, సిస్టమ్స్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. ఈ నివేదిక రావడంతో 90 శాతం విచారణను సిట్ పూర్తి చేసినట్లయింది.  ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టును కోర్టుకు సిట్ అందించనుంది. విదేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐ ప్రశాంత్‌కు మరోసారి సిట్ నోటీసులు ఇవ్వనుంది. 150 మందికిపైగా వ్యక్తులను సిట్ ఇప్పటివరకు విచారించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మెన్, సెక్రెటరీ, మెంబర్, 15 మంది నిందితులు, గ్రూప్-1 అభ్యర్థులను సిట్ విచారించింది. ఈ నెల 11న హై కోర్టుకు సిట్ స్టేటస్ రిపోర్ట్ సమర్పించనుంది.
 


ఒకరి ద్వారా మరొకరికి పేపర్ చేరింది. ప్రవీణ్, రాజశేఖర్ నుంచి రూ.15 లక్షలకు పేపర్ తీసుకున్న నిందితులు.. మరికొంతమందికి విక్రయించారు. పోలీసుల విచారణలో ఈ విషయం బయటపడటంతో.. ఇలా ఎప్పటినుంచి పేపర్లు లీక్ అవుతున్నాయనే అంశం అభ్యర్థులను కలవరపెడుతోంది. ఇలా ఇంకా ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయనేది ఆందోళనకరంగా మారింది. అనేక ప్రశ్నాపత్రాలను నిందితులు లీక్ చేసినట్లు గుర్తించారు.  మరోవైపు పేపర్ లీక్ కేసుపై ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారిస్తోంది. నిందితుల మధ్య లావాదేవీల విషయంపై ఆరా తీస్తోంది.నగదు లావాదేవీలు హవాలా మార్గం ద్వారా జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. దీంతో నిందితుల మధ్య లావాదేవీలు ఎలా జరిగాయనే దానిపై ఈడీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 


పేపర్ లీక్ కేసును త్వరగా చేధించి.. వెంటనే కొత్త పరీక్షల తేదీలను ప్రకటించాలని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఎవరో కొంత మంది చేసిన తప్పునకు లక్షల మంది విద్యార్థులు మానసిక వేదన అనుభవించాల్సి వస్తోందని అంటున్నారు.