Tungaturthi MLA mandula Samel: తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ బ్రాహ్మణ సామాజిక వర్గం,  హిందూ సంప్రదాయాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపుతున్నాయి.  ఒక  కార్యక్రమంలో పురోహితులు ఆశీర్వచనం అందిస్తున్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి.  ఎస్సీ సెల్ అధ్యక్షుడి బాధ్యత స్వీకార కార్యక్రమంలో వ్యాఖ్యలు

Continues below advertisement

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఇటీవల మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మందుల సామేల్, అక్కడ ఉన్న బ్రాహ్మణ పురోహితులు ఆశీర్వచనాలు ఇస్తుండగా వారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.  వీళ్లంతా ఎందుకు? వీళ్ల అవసరం ఏముంది? అనే అర్థం వచ్చేలా హేళన చేస్తూ, హిందూ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడారని పలు హిందూ సంఘాలు,  బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయన అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

భగ్గుమన్న బ్రాహ్మణ సంఘాలు.. ఇంటిపై దాడి 

Continues below advertisement

ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో బ్రాహ్మణ సేవా సంఘాలు తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆగ్రహం చెందిన ఆందోళనకారులు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. కొందరు నిరసనకారులు ఆయన నివాసంపై కోడిగుడ్లతో దాడి చేసి, తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  

 రాజకీయ రంగు పులుముకున్న వివాదం 

ఈ అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  హిందూ ధర్మాన్ని, బ్రాహ్మణులను అవమానించడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది  అని ఆయన విమర్శించారు. సామేల్ వ్యాఖ్యలు చేస్తుంటే స్టేజీపై ఉన్న మంత్రులు, నేతలు చప్పట్లు కొట్టడం దారుణమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఎమ్మెల్యేను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

 పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందన 

వివాదం ముదురుతుండటంతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ పరంగా అన్ని వర్గాల ఆచార వ్యవహారాలను గౌరవిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా వ్యక్తిగత విమర్శలు లేదా ఒక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడితే అది పార్టీ విధానం కాదని తెలిపారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే నుంచి వివరణ కోరతామని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.

 కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన సామేలు వ్యవహారం 

మందుల సామేల్ ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఇప్పటికే తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అన్ని మతాలను, కులాలను సమానంగా గౌరవించాల్సిన బాధ్యతను ఆయన విస్మరించారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.