TSRTC MD Sajjanar: హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులను నడపాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం TSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ సంక్రాంతి పండుగకు 4,484 ప్రత్యేక బస్సుల (Sankranti Special Buses)ను నడుపుతున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. వీటిలో 626 సర్వీస్ లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది ఆర్టీసీ. జనవరి 7 నుంచి 15 వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, మహాలక్ష్మి పథకం అమలు, ప్రయాణికులకు సౌకర్యాలపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హైదరాబాద్ బస్ భవన్ లో శుక్రవారం ఉన్నతాధికారులు, ఆర్ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 


మహా లక్ష్మి స్కీం అమలు కారణంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సంక్రాంతికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని ఆర్టీసీ ఎండీ పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద ఇద్దరూ డీవీఎం ర్యాంక్ అధికారులను ఇంచార్జ్ లుగా నియమించినట్లు చెప్పారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను వారు అందుబాటులో ఉంచుతారని వివరించారు. 


ఈ సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను TSRTC నడుపుతోందని, ఏపీకి షెడ్యూల్ సర్వీసులు యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేశారు. సంక్రాంతికి పండుగకు బస్సు చార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని, గతంలో మాదిరిగానే సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సు సర్వీస్‌లను నడుపుతున్నట్లు తెలిపారు.