Kaleshwaram Project NDSA Report: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీల దుస్థితి, సాగునీటి లభ్యతపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్రంగా తిప్పికొట్టారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్రలో వర్షాల వల్ల గోదావరిలో పారుతున్న నీళ్లను తక్షణమే ఎత్తిపోయాలంటూ బీఆర్ఎస్ నేతలు, వారి అడుగుజాడల్లో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈటెల రాజేందర్ అంటే తమకు గౌరవమేనని, కానీ ఆయన హరీష్ రావు సూచనల మేరకు వివరాలు తెలుసుకోకుండా మాట్లాడటం వల్ల ఆ గౌరవాన్ని కోల్పోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తాము నిపుణుల కమిటీ సూచనలు పాటిస్తుంటే, కేసీఆర్ చైర్మన్గా, హరీష్, కేటీఆర్ సభ్యులుగా ఒక కిలాడీల కమిటీ ఏర్పడిందని, ఇప్పుడు ఈటెల కూడా ఆ గజదొంగల గుంపులో చేరడం దారుణమన్నారు. వీరందరినీ చర్లపల్లి జైలుకు పంపితేనే వారు చేసిన అప్పులేంటో, తప్పులేంటో జనానికి తెలుస్తాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్మాణంలో ఘోర లోపాలు.. 11 నెలలకే కుప్పకూలే స్థితికి మేడిగడ్డ!
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్లానింగ్, డిజైనింగ్, ఆపరేషనల్ మెయింటెనెన్స్లో చేసిన చారిత్రక తప్పిదాల వల్లే నేడు ప్రాజెక్టు ఈ దుస్థితికి చేరిందని ముఖ్యమంత్రి వివరించారు. జూన్ 29, 2019న కేసీఆర్ కాళేశ్వరాన్ని ప్రారంభిస్తే.. కేవలం 11 నెలలకే, అంటే 18-5-2020 నాడే మేడిగడ్డ బ్యారేజీలో తీవ్ర లోపాలున్నాయని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బీవీ రమణారావు అధికారికంగా లేఖ రాశారని రేవంత్ బయటపెట్టారు. నాటి ప్రభుత్వం ఆ హెచ్చరికలను పట్టించుకోకపోవడం వల్లే సమస్య పెద్దదై, అక్టోబర్ 21, 2023న మేడిగడ్డ 7వ బ్లాక్ కుంగిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021 చట్టప్రకారమే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డను సందర్శించిందని, తమ అవినీతి బయటపడుతుందనే భయంతోనే బీఆర్ఎస్ నేతలు ఎన్డీఎస్ఏ పర్యటనపై నీలినీడలు కమ్ముతున్నారని దుయ్యబట్టారు.
ఎన్డీఎస్ఏ నివేదిక సమగ్రం
పది నెలల పాటు క్షేత్రస్థాయిలో నిపుణులు రకరకాల పరీక్షలు జరిపిన అనంతరం ఎన్డీఎస్ఏ సమర్పించిన తుది నివేదికలోని అంశాలను సీఎం రేవంత్ రెడ్డి క్లియర్గా చదివి వినిపించారు. నివేదికలోని 346వ పేజీలో మేడిగడ్డ 7వ బ్లాక్ తీవ్రంగా దెబ్బతినడం వల్ల అది నీటి మళ్లింపునకు పనికిరాకుండా పోయిందని స్పష్టంగా ఉందన్నారు. అలాగే 352వ పేజీలో అన్నారం బ్యారేజీ, 356వ పేజీలో సుందిళ్ల బ్యారేజీ తీవ్రంగా దెబ్బతిన్నాయని, అక్కడ నీటి నిల్వ కానీ, మళ్లింపు కానీ అస్సలు సురక్షితం కాదని నిపుణులు తేల్చిచెప్పారని గుర్తుచేశారు. నివేదిక ఎగ్జిక్యూటివ్ సమ్మరీలోని 17వ పాయింట్ ప్రకారం.. ఈ మూడు బ్యారేజీల పునరుద్ధరణకు సమగ్రమైన కొత్త డిజైన్లు అవసరమని, తక్షణ స్థిరీకరణ చర్యలు చేపట్టాలని సిఫారసు చేసింది. కేంద్రం లేదా సీడబ్ల్యుసీ ఆమోదం లేకుండా అక్కడ రిపేర్లు చేయడం అసాధ్యమని సీఎం స్పష్టం చేశారు.
కన్నెపల్లిలో నీళ్లే లేవు.. గేట్లు మూస్తే బ్యారేజీలు కొట్టుకుపోతాయి
నదిలో ప్రవాహం ఉండటం వేరు.. పంపింగ్కు అవసరమైన నీటిమట్టం ఉండటం వేరు అని రేవంత్ రెడ్డి టెక్నికల్ అంశాలను వివరించారు. మేడిగడ్డ బెడ్ లెవల్ 88.50 మీటర్లు, క్రెస్ట్ లెవల్ 89.50 మీటర్లు కాగా.. అక్కడ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి పంప్ హౌజ్ ద్వారా నీటిని లిఫ్ట్ చేయాలంటే కనీసం 93.50 మీటర్ల పంపింగ్ లెవల్ ఉండాలన్నారు. కానీ ప్రస్తుతం అక్కడ కేవలం 89.90 మీటర్ల నీటిమట్టం మాత్రమే ఉందనే నిజాన్ని బయటపెట్టారు. అన్నారం, సుందిళ్లలో కూడా గేట్లు మూస్తే తప్ప చుక్క నీరు నిల్వ ఉండదని, అయితే బ్యారేజీలు భద్రంగా లేవు కాబట్టి గేట్లు అస్సలు మూయవద్దని ఎన్డీఎస్ఏ ఖచ్చితమైన ఆదేశాలిచ్చిందన్నారు. ఒకవేళ కన్నెపల్లి నుండి ఎత్తిపోసినా, పైన గేట్లు ఓపెన్ ఉన్నందున ఆ నీరంతా మళ్లీ మేడిగడ్డకే వస్తుందని.. ఇలాంటి పరిస్థితుల్లో నీళ్లు ఎత్తిపోయండి అని అరుస్తున్న వారు ఇంజనీర్ల ముసుగులో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
పోలవరంకు నీళ్లు పోతుంటే హరీష్ రావు నాడు గాడిదలు కాసారా?
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మూడు బరాజుల పునరుద్ధరణ చర్యల కోసం ప్రత్యేక సాంకేతిక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఎన్డీఎస్ఏ గైడ్లైన్స్ ప్రకారమే ముందుకు వెళ్తుందని సీఎం స్పష్టం చేశారు. ఈటెల రాజేందర్ .. మీ కిలాడీల కమిటీని తీసుకుని ఢిల్లీలోని ఎన్డీఎస్ఏ వద్దకు వెళ్లి, వారిని ఒప్పించండి, మేము కూడా పంపులు ఆన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని సవాల్ విసిరారు. మాజీ మంత్రి హరీష్ రావు నాడు కమిషన్లు బొక్కిన సంగతి తెలిసి కేసీఆరే ఆయనను పక్కనబెట్టారని, కమీషన్ల కక్కుర్తితో ఇప్పుడు క్రషర్లను కూడా వదలడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో పట్టిసీమ ద్వారా ఏపీకి 105 టీఎంసీలు తరలిస్తుంటే హరీష్ రావు గాడిదలు కాసారా అని ప్రశ్నించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే పోలవరంకు తెలంగాణ నీళ్లు పోవని హరీష్ రావు గ్యారెంటీ ఇవ్వగలరా అని నిలదీస్తూ, ఈ గజదొంగల గుంపులో ఈటెల చేరవద్దని హితవు పలికారు.
