మొన్న వరి కొనుగోలుపై కేంద్రాన్ని నిలదీసిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు గిరిజనుల రిజర్వేషన్ అంశంతో ఇరుకున పెట్టే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే దీనిపై తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే పార్లమెంట్‌ను తప్పుదారి పట్టించేలా అబద్దాలు చెబుతోందని టీఆర్‌ఎస్‌ ఎంపీలు మండిపడ్డారు.  సభ నుంచి వాకౌట్‌ చేసిన ఎంపీలు మీడియా సమావేశం పెట్టి వివరాలు అందజేశారు. 


గిరిజనులకు రిజర్వేషన్ పెంచుకుంటాం అనుమతి ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి 2017లోనే పంపించామని తెలిపారు ఎంపీ నామానాగేశ్వరరావు. ఆ తర్వాత ఫాలో అప్‌గా లేఖలు రాశామని గుర్తు చేశారు. దిల్లీలో చాలా సార్లు ఇదే అంశంపై కేంద్రమంత్రులతో సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. కానీ కేంద్రమంత్రి భిశ్వేశ్వర తుడు పార్లమెంట్‌ను తప్పుదారి పట్టించారన్నారు. గిరిజన రిజర్వేషన్ పెంచే ఆలోచన ఉందా... అలాంటి ప్రతిపాదనలు ఏమైనా వచ్చాయా అని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వేసిన ప్రశ్న వేస్తే.. అలాంటిదేమే లేదని చెప్పడంపై నామా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న అక్కసునంతా కేంద్రం తీర్చుకుంటుందని.. టీఆర్‌ఎస్‌పై ఉన్న కోపాన్ని ప్రజలపై తీర్చుకుంటుందన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్పిన తుడు ను పదవి నుంచి తొలగించాలన్నారు. అందుకే ప్రివిలేజ్‌ మోషన్ పెట్టామన్నారు నామా.  







ఎందుకు గిరిజన బిడ్డలపై పగ బట్టారో అర్థం కావడం లేదన్నారు టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు. అసెంబ్లీ తీర్మానం చేసి బిల్లు పంపిస్తే తమకు ఏమీ రాలేదని తప్పుదారి పట్టించారన్నారు. ప్రజాస్వామ్య విలువల్లేకుండా పార్లమెంట్‌లో అబ్బదాలు ఆడారన్నారు. అందుకే ఆ మంత్రిపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ మోషన్ ఇచ్చామన్నారు. గిరిజిన బిడ్డలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేయాలో అంత చేశామని.. కేంద్రం పరిధిలో ఉన్న రిజర్వేషన్‌ కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నామని గుర్తు చేశారాయన. పార్లమెంట్‌ సాక్షి చెప్పిన అబద్దాలకు మంత్రి, కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 


ఏడేళ్లుగా ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుంటే కేంద్రం సాయం చేయకపోగా మరింత దారుణంగా కొర్రీలు పెడుతుందన్నారు మరో ఎంపీ కేశవరావు. పార్లమెంట్‌ను మిస్‌లీడ్‌ చేయడం ప్రజాస్వామ్యంలో పెద్ద తప్పని అభిప్రాయపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే తప్పుదారి పట్టేంచేలా సమాచారం ఇచ్చిన మంత్రిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రపోజల్ ఒకటి ఉన్నట్టు కేంద్ర హోంశాఖకు 2017లోనే కేంద్ర గిరిజన శాఖ చెప్పిందన్నారు. దీన్ని కూడా బుల్డోజ్‌ చేసి పార్లమెంట్‌లోను తప్పుదారి పట్టించారన్నారు. 


అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్స్ చేసిన తర్వాత ఐదేళ్లుగా గుర్తు చేస్తున్నప్పటికీ కేంద్రం గుర్తించలేదన్నారు ఎంపీ మలోతు కవిత. తీర్మానం చేసినప్పుడు సభలో కిషన్‌ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారని గుర్తు చేశారామె. ఇప్పుడు ఆయన కేంద్రమంత్రి స్థానంలో ఉన్నారని.. ఆయన కూడా కేంద్రం తీరును తప్పుపట్టడం లేదని మండిపడ్డారు. 


రిజర్వేషన్ పెంచడయ్యా అంటే తమకు ప్రతిపాదన రాలేదంటున్నారుని.. వడ్లు కొనండయ్యా అంటే మేం కొనం అంటున్నారని కవిత ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు గిరిజనులను అంతా ఓటు బ్యాంకుగా చూశారని ఇప్పుడే వాళ్లకు హక్కులు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. దాన్ని కూడా కేంద్రం అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చిందంటే చాలా ఆనందించిన గిరిజనులను కేంద్రం మోసంతో డీలా పడిపోయారన్నారు. ఇది బీజేపీకి కేంద్రానికి మంచికదాని హెచ్చరించారు.  


గిరిజన రిజర్వేషన్ అంశంలో అబద్దాలు చెప్పిన కేంద్రమంత్రిపై ప్రివిలైజ్‌ మోషన్ ఇస్తున్న టైంలో బీజేపీలు నలుగురు ఎంపీలు ఉన్నారని వాళ్లేమీ మాట్లాడడం లేదన్నారు కొత్తా ప్రభాకర్‌. రేపు వాళ్లంతా గ్రామాల్లోకి ఎలా వెళ్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కచ్చితంగా గిరిజనులకు అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని గిరిజను అసహ్యంచుకుంటారన్నారు. ఇప్పుడైనా వాళ్లు నోరు తెరవాలని డిమాండ్ చేశారాయన.