రాష్ట్రంలో ఆర్థిక విధానంలో మార్పులు తీసుకురావడంతో గ్రామ రెవెన్యూ సహాయకులు (VRA)ల పరిస్థితి దారుణంగా మారింది. ఈ మధ్యకాలంలో వీఆర్‌ఏ, వీఆర్‌ఓలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాంతో సత్వరమే వీరి సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. వీఆర్ఎలకు పే స్కేల్ అమలు చేయాలని, అర్హులైన వీఆర్ఎలకు పదోన్నతులు కల్పించడం. సొంత గ్రామాల్లో వాళ్లకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలని,  సమ్మె కాలంలో, విధి నిర్వహణలో చనిపోయిన, ఆత్మహత్య చేసుకున్న వీఆర్ఎల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని రేవంత్ రెడ్డి తన లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


టీఆర్ఎస్ ప్రభుత్వంలో వీఆర్ఎల బతుకులు అగమ్యగోచరంగా మారాయి. వారి అకాల మరణాలు, ఆత్మహత్యలు నిత్యకృత్యం కావడం బాధాకరం అన్నారు. వాళ్లతో గొడ్డు చాకిరీ చేయించుకోవడమే తప్ప, వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని. తమ సమస్యలను  పరిష్కరించావని, ఉద్యోగ భద్రత కల్పించాలని మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వీఆర్ఏలు గత 48 రోజలుగా సమ్మె చేస్తున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. అయిన మీ రాక్షస ప్రభుత్వంలో చలనం లేకపోవడం అత్యంత బాధాకరం అని తన లేఖలో పేర్కొన్నారు.






అసెంబ్లీ సాక్షిగా హామీలు.. అమలు ఎప్పుడు
వీఆర్ఏలకు పే స్కేల్‌ ఇస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా 2020, సెప్టెంబర్ 9న మీరు హామీ ఇచ్చి సరిగ్గా రెండేళ్లు దాటింది. ఇకపై వీఆర్వోలు ఉండరు. విద్యార్హతలు కలిగిన వీఆర్‌ఏలకు పే స్కేల్‌అమలు చేస్తాం. ఉన్నత విద్యార్హతలు ఉన్న వారికి పదోన్నతులు కల్పిస్తాం. 55 ఏళ్లు నిండితే వారి పిల్లలకు వారసత్వంగా వీఆర్‌ఏలుగా అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా హామీలు గుప్పించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
మీ హామీలను చూసి వీఆర్ఏలు ఉబ్బితబ్బిబ్బయ్యారు. జీవితాలు మారిపోతాయని ఆశపడ్డారు. పే స్కేల్‌ అమలు చేస్తే రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా వేతనం వస్తుందని ఆశ పడ్డారు. పీఆర్సీ అమలు చేసినప్పుడల్లా జీతాలు పెరుగుతాయని భావించారు. ఇతర శాఖల్లోని ఉద్యోగుల తరహాలోనే పదోన్నతులు వస్తాయని ఆశించారు. మరీ ముఖ్యంగా ఉద్యోగానికి భద్రత ఉంటుందని భావించారు. కానీ మీరు యదావిధిగా మాటతప్పారు. ఉదారంగా హామీలు ఇవ్వడమే తప్ప, వాటిని అమలు చేసే చిత్తశుద్ధి మీకు ఎప్పుడూ లేదు. వీఆర్ఎల విషయంలో సైతం అదే ధోరణిని ప్రదర్శించారు.


ముఖ్యమంత్రి మాటకే విలువ లేదు..
గత్యంతరం లేని పరిస్థితుల్లో, తమ బతుకుతెరువును కాపాడుకోవాలన్న ఆందోళనతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 వేల మంది వీఆర్‌ఏలు సమ్మెబాట పట్టారు. సమ్మెకు దిగి శనివారం నాటికి 48 రోజులు పూర్తయింది. వీఆర్‌ఏలు సమ్మెకు వెళ్లడంతో అప్పటి నుంచి ప్రభుత్వం రూ. 10,500 గౌరవ వేతనం కూడా నిలిపేసింది. ఓవైపు, రెండు నెలలుగా జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు. మరోవైపు, ఉద్యోగం ఉంటుందో ఉండదోననే ఆందోళన. ఇప్పటి వరకూ 28 మంది వీఆర్‌ఏలు చనిపోయారు. దాదాపు రెండు రోజులకు ఒకరు చొప్పున మృత్యువాత పడ్డారు. వీరంతా నడి వయసు వారే కావడం మరో విషాదం. ఈ కుటుంబాలకు దిక్కెవరు? మాట ఇచ్చిన తప్పిన మీరే ఈ చావులకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.


‘మీ పాలనలో వీఆర్ఏలు ఉపాధి హామీ కూలీల కంటే దీనమైన పరిస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. ఏళ్లకేళ్లు కష్టం చేసినా ప్రమోషన్లు రావు, ప్రయోషన్ల కోసం ఎదురు చూసి వయసు పరిధి దాటి పోవడంతో మరో ఉద్యోగానికి వెళ్లలేక... ఉన్న కొలువులో బతుకు బండి నడపలేక నరకయాతన అనుభవిస్తున్నారు. పేరుకే పార్ట్ టైమర్లు తప్ప... ఫుల్ టైమర్ల కంటే ఎక్కువ పని భారాన్ని మోస్తున్న వ్యవస్థ ఏదైనా ఉందంటే అది వీఆర్ఎల వ్యవస్థే. వీఆర్ఏల్లో 90 శాతం బీసీలు, దళిత వర్గాల బిడ్డలే ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 30 రకాల విధులను వీఆర్ఎలు నిర్వర్తిస్తున్నారంటేనే వీరి అవసరం, పాత్ర ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు. 


2020లో మీ ప్రభుత్వం వీఆర్ఓల వ్యవస్థను రద్దు చేయడంతో వీఆర్ఎల పై పని భారం మరింత పెరిగింది. చాలీచాలని జీతం మరోవైపు తీవ్ర పని ఒత్తిడితో కొందరు వీఆర్ఎలు గుండెపోటుకు గురై చనిపోతున్నారు. గతంలో నిజామాబాద్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వీఆర్ఎలు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు నమోదయ్యాయి. ఇంత జరిగినా మీరు సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోగా దేశాన్ని ఉద్దరిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. వీఆర్ఏల బతుక్కు భరోసా ఇవ్వలేని మీరు భారతదేశాన్ని ఉద్దరిస్తారా? వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ శేషాద్రి ఛైర్మన్ గా నియమించిన కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదంటేనే అది కంటి తుడుపు కమిటీ అని అర్థమవుతోంది.
రాష్ట్రంలో పాలన ఉన్నట్టా లేనట్టా!?
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే రాష్ట్రంలో పాలన ఉన్నట్టా లేనట్టా!? అందుకే వీఆర్ఎలు వాళ్ల సమస్యల పరిష్కారం కోసం రోడెక్కే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధాన కారణం మీరే. ఇప్పటికైనా వాళ్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. లేనిపక్షంలో వీఆర్ఎల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్ధతుగా నిలవడమే కాక... వారి తరపున ప్రత్యక్ష కార్యచరణకు సైతం సిద్ధమవుతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.


డిమాండ్లు :
మీరు స్వయంగా హామీ ఇచ్చిన విధంగా వీఆర్ఎలకు పే స్కేల్ అమలు చేయాలి. 
అర్హులైన వీఆర్ఎలకు పదోన్నతులు కల్పించాలి.
సొంత గ్రామాల్లో వాళ్లకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలి.
సమ్మె కాలంలో, విధి నిర్వహణలో చనిపోయిన, ఆత్మహత్య చేసుకున్న వీఆర్ఎల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.